“విజనరీ”… అంటే… అంటే భవిష్యత్తును ముందుగానే ఊహించగల శక్తి, అసాధారణమైన సృజనాత్మకత, కొత్త ఆలోచనలు కలిగిన వ్యక్తి అని అర్ధం! అంటే… వీరు మార్పును తీసుకురావడానికి, ఆదర్శవంతమైన ప్రణాళికలను రూపొందించడానికి, ఊహించని అవకాశాలను గుర్తించడానికి ప్రసిద్ధి చెందినవారన్నమాట! పరిపాలనలో ఉన్నవారు.. రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తారన్నమాట.
అయితే.. ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సైతం ఆ పార్టీ నాయకులు, ఓ వర్గం మీడియా ఈ విధంగానే సంబోధిస్తుంది, ఆ విధంగానే ప్రచారం చేస్తుంది. అయితే.. నిజంగానే చంద్రబాబు విజనరీనా..? ఆయన ఇప్పటివరకూ చేసిన విజన్ ఏమిటి..? ఇతరుల పనిని తన ఖాతాలో వేసుకోకుండా వాస్తవంగా తనదైన విజన్ తో చేసిన ఒక్క పని ఏమిటి..? అని అంటే.. ఆన్సర్ వారికే తెలియాలి!
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నానికి సుమారు 50శాతానికి పైగా బంకుల వద్ద ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఫలితంగా… వాహదారులు ప్రత్యక్ష నరకం చూడగా.. వరి, ఆక్వారైతుల పరిస్థితి వర్ణణాతీతం. వారంతా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తుండగా.. తాజాగా ఈ సమస్య పెను ఉప్పెనలా మారిందని అంటున్నారు!
అలా అని ఈ సమస్య సడన్ గా వచ్చింది కాదని.. సుమారు రెండు మూడు రోజులుగా సంకేతాలు వస్తూనే ఉన్నాయని.. అయినప్పటికీ విజనరీ చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించలేకపోయారని అంటున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పరిపాలనపై… “పడకేసిందా”? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా.. తాజాగా ముంబైలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నగరంలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ… తమ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలంతా రావాలని, పెట్టుబడులు పెట్టాలని, అసలు తమ పాలనలో సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. సరిగ్గా అదే సమయానికి ఏపీలో ఇంధన కొరతతో ప్రజానికం అల్లాడిపోయింది. మరోవైపు ఈ విషయం దావానంలా వ్యాపించింది!
చంద్రబాబు అలా పక్క రాష్ట్రంలో ఉంటే… సుమారు అరడజను మంది మంత్రులు సింగపూర్ టూర్ లో ఉన్నారు! ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇటీవల ఆపరేషన్ జరగడంతో పక్క రాష్ట్రంలో ఉండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరోవైపు.. తండ్రిని కోల్పోయిన విషాదంలో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. లోకేష్ ఆచూకీ లేకుండాపోయారు!
ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన చంద్రబాబు… సమస్య ఉందని ఒప్పుకుంటూ, సోమవారానికల్లా సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు! కానీ.. సమస్య పరిష్కారం కాలేదు! బంకుల వద్ద వాహనదారులు పడుతున్న అగచాట్లలో మార్పు రాలేదు! ఇదే సమయంలో… ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అధికారుల అలసత్వమే కారణం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు… రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ఈ విషయాన్ని గమనించాలని వాహనదారులకు సూచించిన మనోహర్… ఒకరోజు గడిచిన తర్వాత మాత్రం… ఇంధన సమస్య అదుపులోకి వచ్చే వరకు బల్క్ కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్య లేనప్పుడు, సమస్య అదుపులోకి రావడం అనే టాపిక్ కి చోటెక్కడుటుందో సదరు మంత్రిగారికే తెలియాలి!
ఈ నేపథ్యంలో.. ఏపీలో కూటమి పరిపాలన, చంద్రబాబు అనుభవం, అధికారులపై ఆగ్రహం వంటి విషయాలపై విశ్లేషకులు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా…. చంద్రబాబుకు తలంటే పనికి పూనుకుంటున్నారు. ఇందులో భాగంగా… మూడు రోజులుగా సమస్య ఉంటే అధికారులు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్న చంద్రబాబును… అసలు ముఖ్యమంత్రిగా ఆయన ఏమి చేస్తున్నట్లు..? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో… “రాజకీయ జవాబుదారీతనం” గురించిన పాఠాలు నేర్చుకోవడానికి పలువురు మంత్రులు సింగపూర్ కి వెళ్లారు. అయితే… వారిలో చాలామంది ఇప్పటికే పలుమార్లు మంత్రులుగా పనిచేసిన వారు కాగా.. వారంతా ఎప్పటినుంచో రాజకీయాల్లోనూ, పరిపాలనలోనూ ఉన్నవారు కావడం గమనార్హం!
మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో “రాజకీయ జవాబుదారీతనం” సంగతేమిటి..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తోన్నాయి. సమస్య వచ్చినప్పుడు రాష్ట్రంలో కేవలం “అధికారుల జవాబుదారీతనం” మాత్రమే ఉంటుందా..? పాలకులు తప్పించుకు తిరుగువారేనా..? అని అడుగుతున్నారు పరిశీలకులు.
అంటే… రాష్ట్రంలో ఏదైనా విషయంపై సక్సెస్ వస్తే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లు తీసుకుంటారని… ఏదైనా తప్పు జరిగినా, ఫెయిల్యూర్ కనిపించినా.. దానికి అధికారులను బాధ్యులుగా చూపిస్తారని విశ్లేషకులు మండిపడుతున్నారు.
మూడు రోజులుగానే సమస్య ఉన్నా పట్టించుకోలేదు అన్నట్లుగా అధికారులపై చంద్రబాబు మండిపడితే.. అసలు ఇంత పెద్ద సమస్య ఉన్న విషయం ఆయన దృష్టికి ఎందుకు రాలేదు..? వచ్చినా పట్టించుకోలేదా..? ఇదేనా రియల్ టైం గవర్నెన్స్..? అనే ప్రశ్నలూ తదనుగుణంగా వినిపిస్తున్నాయి.
ఈ విధంగా చంద్రబాబు పరిపాలన, ఆయన అనుభవం, చెప్పుకునే విజనరీ లక్షణాలపై విశ్లేషకులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ సందర్భంగా… మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరూ” సినిమాలోని… “హిట్ అయ్యిందనుకోండి క్రెడిట్ మొత్తం మనం తీసేసుకోవచ్చు, ఫట్ అయ్యిందనుకోండి క్రెడిట్ మొత్తం వాడికి ఇచ్చెయ్యొచ్చు” అనే డైలాగ్ ను చంద్రబాబుకు అప్లై చేస్తున్నారు. ఇది ఎలా “లీడర్ షిప్” అవుతుందంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అలా అని ఈ తరహా వ్యవహారం ఈ ఒక్కవిషయంలోనే అనుకుంటే పొరపాటే అంటూ పలు సంఘటనలను గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యే అరాచకాలకు పాల్పడినా, ఏదైనా శాఖలో తప్పులు జరిగినా, ఏ అధికారి తప్పుగా ప్రవర్తించినా… వెంటనే ఓ వర్గం మీడియాలో.. “చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు” అని వార్తలు వస్తాయి. సరిగ్గా గమనిస్తే.. అక్కడ “ఆగ్రహాలు” మాత్రమే ఉంటాయి తప్ప వారిపై ఎలాంటి “చర్యలు” ఉండవు అని గుర్తుచేస్తున్నారు!
ఈ కోణంలోనే… “సీఎం చంద్రబాబు చాలా మంచివాడు, చాలా సమర్ధుడు, రోజుకి 16 గంటలపైనే పని చేస్తారు, నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారు, ఆయన అందరికంటే సుమారు పాతికేళ్లు ముందే ఉంటారు.. కానీ… ఎమ్మెల్యేలు, మత్రులే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు” ఇలాంటి అభిప్రాయం జనంలోకి పంపి, రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా ఆయన అనుకూల మీడియా పని చేస్తుంటుందని చెబుతున్నారు.
అందుకే… రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య వచ్చినా, దేశంలో మరెక్కడా లేని సమస్య ఏపీలో కనిపించినా.. ఇందులో ముఖ్యమంత్రి అసమర్ధత, ముందుచూపు కొరవడటం వంటి చర్చే ఎక్కడా ఉండదు! ఉండేదంతా… అధికారుల అలసత్వం, ఈ విషయంలో వారిపై చంద్రబాబు ఆగ్రహం మాత్రమే! మరి జనం పడుతున్న బాధల సంగతి అంటారా.. అది ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడే అంశం కదా తమ్ముళ్లూ..!!
ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే… రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత వెనుక కుట్ర కోణం ఉందని, అందులో వైసీపీ పాత్ర ఉందన్నట్లుగా కథనాలు టీడీపీ అనుకూల మీడియా నుంచి వెలువడటం! ఇంతకు మించి దిగజారుడుతనం ఉంటుందా..? ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు పరిపాలనపై విశ్లేషకులు విరుచుకుపడుతున్నారు. నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.
