దోనకొండ.. తుళ్లూరు.. ఏది ఖాయం చేశారు?
ఏపీ రాజధాని అమరావతి మునక మాటేమో కానీ.. దాని పర్యవసానంగా సామాన్య ప్రజలకు బోలెడన్ని నిజాలు తెలిసొస్తున్నాయి. రాజధాని పేరుతో తెలుగు దేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆడిన నాటకం బయటపడుతోంది. చంద్రబాబు, ఆయన అనుయాయుల భూములు భారీగా ఉన్న చోట రాజధానిని నిర్మించుకోవడం ద్వారా ఇన్ సైడ్ ట్రేడింగ్(రాజధాని వస్తుందని తెలిసీ) కి పాల్పడి ముందే భూములు కొనుక్కుని రియల్ వెంచర్లు ప్లాన్ చేసుకుని వీళ్లు ఆడిన నాటకాలన్నీ బయటపడుతున్నాయి. అమరావతి భారీ కట్టడాలకు ఆమోదయోగ్యం కాదని నివేదికలు, కమిటీలు ఘోషించినా అదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు దుస్సాహసం చేశారు. ప్రజాధనాన్ని ఇప్పటికే భారీగా దుర్వినియోగం చేశారని అర్థమైంది.
ఇన్ని విషయాలు తెలిసిన ప్రజలకు రాజధానిని మార్చాల్సి వస్తే ఎక్కడికి మారుస్తారు? అన్నదానిపై సరైన క్లారిటీ రావడం లేదు. 3వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్న తుళ్లూరు ప్రాంతానికి మారిస్తే పర్యవసానం ఏమిటి? అన్నదానిపైనా రియల్టర్లు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అన్నట్టు ప్రకాశం జిల్లా దోనకొండకు రాజధానిని తరలిస్తారని వైయస్ జగన్ అనుయాయులు అక్కడ భూములు కొనుక్కుంటున్నారన్న ప్రచారం విస్త్రతంగా సాగింది. మరి రాజధాని డైలెమాతో ఎవరు ఎక్కడ కొన్నా నష్టం భరించాల్సి ఉంటుంది. లక్షల, కోట్ల మేర పెట్టుబడులన్నీ వృధా పోవడం ఖాయం. రాజధాని తరలి వస్తుందని ఇంతవరకూ జగన్ ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ మొత్తం రాద్ధాంతానికి కారకుడైన మంత్రి బొత్స సత్యనారాయణ సైతం దీనిపై మళ్లీ మాట మార్చారు. ప్రస్తుత రాజధాని పరిస్థితిని సమీక్షిస్తామని అన్నానే కానీ.. తరలిస్తామని అనలేదు! అంటూ బొత్స మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు, ఆయన బినామీల రియల్ ఎస్టేట్ కోసమే అమరావతిని ఎంచుకున్నారని ఆయన మీడియా ముఖంగా చెణుకులు వేశారు. అన్నట్టు రెడ్డి సామ్రాజ్యం ఉన్నచోటికి రాజధానిని తరలిస్తారన్న ప్రచారం కూడా ఉంది. మరి ఇంతకీ ఆ సామ్రాజ్యం ఎక్కడుందో జనాలు కనుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తానికి ఒకే ఒక్క వ్యాఖ్యతో బొత్స ఎంతటి ప్రకంపనాలు సృష్టించారు. అన్నట్టు ఉన్న ఫళంగా ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అన్ని నగరాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ విధానం అంటూ కొత్త మాట చెప్పారు బొత్స. అంటే రాజధాని పేరుతో అన్నిటినీ ఒకేచోట పెట్టకుండా ఒక్కో అభివృద్ధి కేంద్రాన్ని ఒక్కో నగరానికి తరలించి అన్నిచోట్లా అభివృద్ధికి తెర తీస్తారో ఏమిటో!!