భారత్-పాకిస్తాన్ మధ్య అలజడిని పుట్టించిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దేశ వ్యాప్తంగా మే 7న నిర్వహించనున్న ‘సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్’ ఒకటి హాట్ టాపిక్ గా మారనుంది. శత్రు దాడులు జరిగితే పౌరులు ఎలా స్పందించాలి? ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ఈ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో అలాగే హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఈ అలెర్ట్ డ్రిల్ నిర్వహించనున్నారు.
ఈ మాక్ డ్రిల్లో భాగంగా, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్ళు వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో సైరన్లు మోగించనున్నారు. అప్పుడు ప్రజలు ఎలా స్పందించాలన్న దానిపై నిఘా ఉంటుంది. హటాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేసే బ్లాక్ అవుట్, హాట్లైన్ వ్యవస్థల పనితీరు, ప్రజల తక్షణ చర్యల్ని పరీక్షించనున్నారు. ముఖ్యంగా రక్షణ బంకర్లు, కంట్రోల్ రూమ్లు, స్వయంప్రేరిత స్పందన బృందాల ప్రదర్శనలు ఉండనున్నాయి.
హైదరాబాద్లో బేగంపేట్, కోఠి, ఎల్బీ నగర్, చార్మినార్ పరిధుల్లో ముఖ్య ప్రాంతాల్లో ఈ డ్రిల్ నిర్వహించనున్నారు. వైజాగ్లో గాజువాక, తాగరపువలస, ఎన్టీపీసీ దగ్గర ప్రధాన దృష్టి ఉంటుంది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విపత్తు నిర్వహణ బృందాలు ఇందులో పాల్గొంటాయి. రేడియో ద్వారా హెచ్చరికలు అందించడమో, రహదారులు ఖాళీ చేయించడమో వంటి చర్యలు తీసుకోబోతున్నారు.
ఈ డ్రిల్ యుద్ధ భయంతో కాకుండా, అవగాహన పెంచే ప్రయత్నంగా చూడాలంటూ కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ విస్తృత మాక్ డ్రిల్లో హైదరాబాద్, విశాఖ కీలక కేంద్రాలుగా నిలవడం విశేషం. జనాల్లో అప్రమత్తత పెంచడమే లక్ష్యంగా అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.