బిగ్ బాస్ సీజన్-3 ఆరంభమయ్యే గడువు దగ్గర పడుతున్న కొద్దీ నిరసనలు పెరిగిపోతున్నాయి. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున ఇంటి ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. నిజానికి నాగార్జున ఇంటిముందు ఆందోళనలు చేసినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే.
కార్యక్రమంలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటోందని, కంటెస్టెంట్లకు లైంగిక వేధింపులు ఉంటున్నాయని ఇద్దరు సెలబ్రిటీలు ఆరోపించటంతో గొడవ మొదలైంది. శ్వేతారెడ్డి, గయాత్రి గుప్తలు బహిరంగంగా నిర్వాహకులపై ఆరోపణలు చేయటం సంచలనమైంది.
అదే సమయంలో కంటెస్టంట్ల ఎంపికపైన కూడా అనేక ఆరోపణలు మొదలవ్వటంతో వివాదం తారాస్ధాయికి చేరుకుంది. అప్పటి నుండి కార్యక్రమ నిర్వహణపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. ఎప్పుడైతే కార్యక్రమం నిర్వహణపై కోర్టులో కేసులు పడ్డాయో సంచలనాలు మొదలయ్యాయి.