2014 ఫిబ్రవరి 20 న ఇదే రోజు రాజ్యసభలోఇచ్చిన హామీలుఏమైనవి?

పార్లమెంట్ తలుపులు మూసి గందరగోళం మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ఆమోదించింది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి.కాని రాష్ట్ర విభజన చట్టం రాజ్యసభకు వచ్చే సరికి కాంగ్రెస్ ఆటలు సాగ లేదు.

విధి లేకుండా ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ చట్ట సభ సాక్షిగా 2014 ఫిబ్రవరి 20 వతేదీ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం తదుపరి మంత్రి వర్గ సమావేశంలో పెట్టి ఆమోదించి ప్రణాళిక సంఘానికి పంపారు. ఈ దశలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇచ్చిన హామీ ఏమైంది? వేరుగా వివరించనక్కరలేదు. ఆనాటి హామీని ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నెమరు వేసుకోవడం తప్పు కాదు.

అయిదు ఏళ్లు బిజెపితో అంట కాగిన చంద్రబాబు నాయుడు తుదకంటా నిలవకుండా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి ప్రజలను మోసం చేశారు.దాని ఫలితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా తనకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. 22 మంది సభ్యులను గెలిపించారు. కేంద్రం మెడలు వంచ లేదు. గాని తాను రాజీపడక తప్పింది కాదు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా కేంద్రం తేల్చి వేసింది. అదలా వుంచగా రాష్ట్ర విభజన చట్టం మేరకు రాష్ట్రానికి చట్ట బద్దంగా రావలసిన నిధులు రాయితీలు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుండి సాధించ లేక పోవడమే అసలు సమస్య. ఇందులో ప్రధాన మైనది. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. తాజాగా దాని నిర్మాణ వ్యయం 55 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ అంచనాలను ఇంత వరకు ఆమోదించ లేదు. ఇందులో నష్టపరిహారం పునరావాసానికి 33 వేల కోట్లు అవసరం. అంత మొత్తం కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. నష్టపరిహారం పునరావాసం పూర్తి కాకుండా హెడ్ వర్క్స్ పూర్తి చేసే అవకాశం లేదు. మరి ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడినట్లే.

ఇంకొక ముఖ్యమైన అంశమేమంటే వెనుక బడిన ఏడు జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం. ఏటా జిల్లాకు 200 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కోరితే జిల్లాకు 50 కోట్లు చొప్పున మూడు సంవత్సరాలు 1050 కోట్లు ఇచ్చి కేంద్రం తోక కోసింది. దురదృష్టం ఏమంటే ఒక దఫా 350 కోట్లు విడుదల చేసి తిరిగి వెనక్కి తీసుకున్నది. రాష్ట్ర విభజన చట్టం మేరకు రాజ్ భవన్ హైకోర్టు శాసన సభ మండలి సచివాలయం నిర్మాణ వ్యయం కేంద్రం భరించాలి. ఇందుకు గాను 2500 కోట్లు ఇస్తామని చెప్పి 1500 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు రాజధాని ఏదో తేలలేదు కాబట్టి ఇందుకు చెంది నిధులు వచ్చే అవకాశం లేదు.

ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలదీసే అవకాశం ఏమాత్రం లేదు. కేంద్రం పెట్టిన భిక్షతో సరి పెట్టు కొనవలసి వుంటుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక విధంగా రాష్ట్ర ప్రజలు నష్ట పోతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలో మరో రకంగా కేంద్రం నుండి రావలసిన నిధులు రాకుండా రాష్ట్ర ప్రజలు నష్ట పోనున్నారు