టిడిపికి 130 సీట్లొస్తాయన్నది నిజం కాదా ?

చంద్రబాబునాయుడు తాజా ప్రకటన చూస్తుంటే అందరిలోను అదే అనుమానం వస్తోంది. నాలుగు రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ టిడిపికి 130 సీట్లు వస్తాయని, అధికారంలోకి రాబోయేది మనమే అంటూ భరోసా ఇచ్చారు. పార్టీకి 130 సీట్లు ఎలా వస్తాయనే విషయంలో  హేతువు ఏమీ లేదు. చంద్రబాబు చెప్పారు టిడిపి నేతలు పాటిస్తున్నారు అంతే.

నిజానికి పోలింగ్ రోజు నుండి టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఎవరిలోను లేదు. ఎందుకంటే, పోలింగ్ మొదలైన రెండు గంటలకల్లా చంద్రబాబు ఈవిఎంలపైన, ఎన్నికల కమీషన్ పైన గోల మొదలుపెట్టారు. చంద్రబాబు గోల చూసిన తర్వాత టిడిపికి ఓటమి ఖాయమని అందరికీ  అర్ధమైపోయింది.

పోలింగ్ ముగిసిన తర్వాత సరళిని బట్టి తమకు 120కి పైగా సీట్లు వస్తాయని, అధికారంలోకి రాబోయేది తామేనంటూ వైసిపిలో జోష్ మొదలైంది.  దానికి తగ్గట్లే సోషల్ మీడియాలో కూడా విశ్లేషణలన్నీ వైసిపికి అనుకూలంగా ఉండటంతో టిడిపి నేతలు ఢీలీ పడిపోయారు. పోలింగ్ రోజు మొదలైన చంద్రబాబు గోల ఐదు రోజులకు కానీ తగ్గలేదు. తన ప్రకటనలతో, గోలతో జరిగిన డ్యామేజి అప్పటికి అర్ధమైంది చంద్రబాబు.

అందుకనే 130 సీట్లతో టిడిపి అధికారంలోకి రాబోతోందని మొదలుపెట్టారు. తాజాగా నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ, పార్టీకి అన్ని సీట్లొస్తాయి, ఇన్ని సీట్లోస్తాయనే విశ్లేషణలన్నీ కేవలం ఊహాత్మకమే అంటూ ప్రకటించారు.  వైసిపికి 120 సీట్లు వస్తాయనే విశ్లేషణలు ఊహాత్మకమని చెప్పటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయ్యుండొచ్చు. మరి అది నిజమే అయితే టిడిపికి 130 సీట్లు వస్తాయని చెప్పింది కూడా ఊహే కదా ? అని టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు.