100 రోజుల పాలనపై చార్జిషీటా ?

చంద్రబాబునాయుడుకే కాదు తెలుగుదేశంపార్టీ నేతల్లో చాలామందికి బుర్ర దొబ్బినట్టే ఉంది. జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై చార్జిషీటు రిలీజ్ చేయబోతున్నారు టిడిపి నేతలు. నిజానికి జగన్ ప్రభుత్వానికి జనాలు ఐదేళ్ళ పాలనకు మద్దతు పలికారు. అయితే ఇందులో పూర్తయ్యింది కేవలం 100 రోజులు మాత్రమే. ఈ వంద రోజుల పాలనలోనే టిడిపి నేతలు చార్జిషీటు విడుదల చేస్తున్నామని చెబుతున్నారంటే ఏమిటర్ధం ?

క్షేత్రస్ధాయిలో పరిశీలిస్తే చంద్రబాబు అయినా టిడిపి నేతలైనా ఆరోపిస్తున్నట్లు చార్జిషీటు విడుదల చేయాల్సిన అవసరమైతే లేదనే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తమను చావు దెబ్బ కొట్టారన్న అక్కసు లేకపోతే కసితోనే జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

గ్రామస్ధాయిలో వైసిపి-టిడిపి నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయంటే వాటిల్లో అత్యధికం వ్యక్తిగత కక్షలే ప్రధానం. ఇక టిడిపి మాజీ ఎంఎల్ఏలపై కేసులు నమోదవుతున్నాయంటే అవంతా స్వయంకృతాలే అని చెప్పాలి. అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్ధుల విషయంలో ఎలా వ్యవహరించేవారో ఓడిపోయిన తర్వాత కూడా అదే పద్దతిలో వ్యవహరించారు. దాంతోనే ఇబ్బందుల్లో పడి కేసులను ఎదుర్కొంటున్నారు. అందులోను కోర్టు ఆదేశాలతోనే కేసులు పెడుతున్నారు పోలీసులు.

టిడిపి మాజీ ఎంఎల్ఏలు చేస్తున్న తప్పులు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా చంద్రబాబు ఇంకా జగన్ నే నోటకిచ్చినట్లు తిడుతున్నారు. తన హయాంలో జరిగిన అవినీతిని, తప్పులను జగన్ బయటపెడుతున్నారు. దాన్నే చంద్రబాబు తట్టుకోలేకున్నారు. అందుకనే తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న విషయం తెలిసిపోతోంది.