బాబు మీద సానుభూతి..   వైసీపీ నాయకుల వల్లే !  

 
జగన్ మోహన్ రెడ్డిది  రాజన్న రాజ్యం కాదు, రౌడీ రాజ్యం అని నిత్యం  తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాలో,  తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో  నానా హడావుడి చేస్తున్నారు.  ఆ మాటకొస్తే ఎన్నికలకు ముందు నుంచీ ఇదే నినాదాన్ని వినిపించారు పచ్చ తమ్ముళ్లు.  వైసీపీ కానీ అధికారంలోకి వస్తే..  అరాచక శక్తులు పెరిగిపోతాయని  అధికార అండ చూసి ఎంతకైనా తెగిస్తారని ఇలా  చాలా మాటలే చెప్పి ప్రజలను తమ వైపు తిప్పుకునేలా నానాయాగీ చేశారు. సరే ప్రజలు నమ్మలేదు అనుకోండి.   
 

అయితే తెలుగు తమ్ముళ్ల మాటల ప్రభావమో ఏమో తెలియదు గాని, వైసీపీ నాయకులు కూడా ఓ రేంజ్ తిట్ల పురాణాలు అందుకుంటున్న మాట వాస్తవం.  నిజానికి  వైసీపీలోని నాయకులు కార్యకర్తలు  సమన్వయంతో ఉండాలని.. అది నాయకత్వం నుంచీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ..  అధికార అండ ఉందని..  కొంతమంది నేతలు రెచ్చిపోతున్నారు.  ఇలా మాట్లాడేవాళ్ళు చాలామందే  ఉన్నారు. విజయసాయి రెడ్డి, కొడాలి నాని, రోజా,  కొలుసు పార్ధసారధి, అనిల్ కుమార్ యాదవ్ లాంటివారి గురించి  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 
 

విజయసాయి రెడ్డి, కొడాలి నాని, రోజా అంటే వారి నైజం అదే అని అనుకోవచ్చు. కొలుసు పార్ధసారధి లాంటి నాయకుడు కూడా  ఓ టీడీపీ నాయకుడిని  నాలుక కోస్తా.. వాడు ఒట్టి దద్దమ్మ అని రెచ్చిపోయి తిట్టాడంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.  ప్రతి రోజూ వైసీపీ నాయకులు   టీడీపీ నాయకుల పై తిట్ల పురాణాలు అందుకుంటున్నారు.  స్వతహాగా ఆవేశపరుడైన అనిల్‌కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీలోనూ అలాంటి ఆవేశాన్ని ప్రదర్శించడాన్ని మనం ఇప్పటికే చూశాం.  తరుచుగా నోటికొచ్చినట్లు బాబును తిడుతూ ఏకవచనంతో బాబును నానా మాటలు అంటున్నారు. దాంతో కొన్ని వర్గాల్లో చంద్రబాబు మీద సానుభూతి పెరుగుతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు.