ప్రజల క్షేమం కంటే   ఆదాయమే ముఖ్యమా ?

 
క‌రోనా దెబ్బకు ప్ర‌జ‌లు  ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నా,  ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ లోనే బతుకుతున్నారు. మరి ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి ? లాక్‌ డౌన్‌ పేరుతో వివిధ దుకాణాలకు పలు నిబంధనలు విధించి..  మద్యం దుకాణాలు తెరిచేందుకు మాత్రం యథేచ్ఛగా అనుమతి ఇచ్చాయి.  ఇక లాక్‌ డౌన్‌ కు అర్థమేముంది ? పైగా అత్యవసరమైన నిత్యావసర వస్తువుల దుకాణాలకు మాత్రం షరతులు విధించి మరీ..  మధ్యాన్ని పారించాయి.  కరోనా వ్యాప్తి విస్తృతమయ్యే అవకాశమున్నందున లాక్‌ డౌన్‌ సమయంలో మద్యం విక్రయాలను అడ్డుకోవాలి.  కానీ జనం బారులు చూస్తే మన ప్రజానీకం మత్తులో ఎంతలా మునిగితేలడానికి ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తోంది.
 

అందుకేనేమో మద్యదుకాణాలు తెరవాలని  ప్రభుత్వాలు  నిర్ణయం తీసుకుని ఉంటాయి. సరే ఇంతకీ  మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారా ? సోషల్ మీడియాలో జనం బారులు చూస్తే తెలుస్తోంది, చర్యలు ఎలా ఉన్నాయో..?  అయినా 65 ఏళ్లవారు బయటకు రావద్దని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది, కానీ  మద్యం షాపుల వద్ద ఆ వయసువారే అధికంగా కనిపిస్తున్నారనేది వాస్తవం. ప్రాణాలకు తెగించి ముందు సాధిస్తున్నారు,  యుద్ధ భూమిలో వీరులు కూడా ఇంతలా ప్రాణాలను పణంగా పెట్టరేమో.. వయసు ముదిరిన ముందు బాబులు మాత్రం మద్యం కోసం ఏమైనా చేసేలా ఉన్నారు.   

ఈ తరహా చర్యల వల్ల కరొనాను ఆపగలమా ? కరోనా మరోసారి విజృభింస్తే  మన వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.. అపహాస్యమవుతుంది కూడా.  అయినప్పటికీ, మన ప్రభుత్వాలకు మద్యం విక్రయాల వల్ల వచ్చే ఆదాయమే ముఖ్యమైపోయిందనేది కాదనలేని కఠోర నిజం అని చెప్పకతప్పట్లేదు.