జగన్ నిర్ణయం మార్చుకోక తప్పదా ? 

 
రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా… పదవ తరగతి విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహించేందుకు  వచ్చే నెల 10వ తేదీ నుంచి జగన్ ప్రభుత్వం నిర్వహించేందుకు షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. రాష్ట్రంలో రోజుకు 300లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయినా జగన్ పరీక్షలను రద్దు చెయ్యట్లేదు. అయితే తెలంగాణా, తమిళనాడు, ఒడిషా, చత్తీస్ ఘడ్ లాంటి  రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
 
నిజానికి తెలంగాణా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవగా, కొందరు హైకోర్టు ఆశ్రయించారు. దీంతో ఆ రాష్ట్ర హైకోర్టు పరీక్షల నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  కానీ ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించి తీరతామని విద్యాశాఖ మంత్రి ఇటీవల స్పష్టం చేశారు. గతంలో ఒక్కో సబ్జెక్ట్ కు రెండు పేపర్లు ఉండేవి, ప్రస్తుతం వాటిని ఒక పేపర్ కు తగ్గించారు. పరీక్షా పేపర్ లోని ప్రశ్నల సంఖ్య తగ్గించి పరీక్షా సమయం కుదించారు. పరీక్ష కేంద్రాల్లో సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ లను అందుబాటులో ఉంచడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
 
అయినా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయడమే మేలనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన, టీడీపీ, బిజెపి, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ను విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల విషయంలో తన నిర్ణయం మార్చుకోక తప్పేలా కనిపించడం లేదు.