జగన్ ఈ సారైనా సక్సెస్ అవుతాడా ? 

 
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక సరఫరా విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదనేది  వైసీపీ నాయకులే చెబుతున్న మాట.  టీడీపీ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయడమే తప్పు అయితే..  కొత్త విధానాన్ని వెంటనే అమలలోకి తీసుకురాకపోవడం మరో తప్పు,  దాంతో  జగన్ ప్రభుత్వం అబాసుపాలయ్యింది.  ఈ క్రమంలో పనులు దొరకక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కొన్ని దీన గాధలని బట్టి అర్ధమవుతుంది.   
 
సరే ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదని మొదటినుండీ మొత్తుకుంటున్నా  వైసీపీ విధానం మారలేదు. ఈ అంశం పై ప్రతి పక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుబట్టినా  ఆందోళనలు చేపట్టినా.. మొదట్లో  జగన్  పట్టించుకోలేదనేది వాస్తవం.   వైసీపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం బుకింగ్ కు, సరఫరాకు మధ్య 2 లక్షల టన్నుల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిచామని తెలిపారంటే  ఇసుక పై అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.     
 
.మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతున్నారు.   పనులకు ఇసుక దొరకడం లేదని, సామాన్యులకు సైతం గుప్పెడు ఇసుక ఇవ్వలేకపోతున్నామని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాపోయారంటే  ఇసుక కష్టాల గురించి చెప్పుకోవడం అనవసరం.  
 
అయితే ఇసుక విధానాన్ని చక్కదిద్దేందుకు  జగన్ ప్రభుత్వం  గ్రామ‌, వార్డు స‌చివాలయాల ద్వారా ‌ఇసుక బుకింగ్ చేసుకునే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కు క‌ల్పించాల‌ని  నిర్ణయం తీసుకుంది.  నియోజక వర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడడం, చిన్న చిన్న నదుల నుంచి పక్కనే ఆనుకుని ఉన్న గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వడం వంటి చర్యలకు ప్రభుత్వం అనుమతించింది. మరి   జగన్ ఈ సారైనా సక్సెస్ అవుతాడా ? జగన్  నిర్ణయాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయో  చూడాలి.