కన్నాకు, కిట్స్ వార్తలకు చెక్ పెట్టిన విజయసాయి

కన్నాకు, కిట్స్ వార్తలకు చెక్ పెట్టిన విజయసాయి

ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చెలరేగినా వాటికి ధీటుగా సమాధానం చెప్పడం.. సమయానికి తగిన విధంగా మరో అంశాన్ని తెరపైకి తీసుకురావడంలో వైకాపా నేత విజయసాయి రెడ్డి ఆరితేరిపోయారు. 

రాష్ట్రంలో గత రెండు రోజులుగా ర్యాపిడ్ కిట్స్ కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారి.. ప్రభుత్వ ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో విజయసాయి రెడ్డి రాజధాని మార్పు వివాదాన్ని తెరపైకి తెచ్చారు. కరోనా విజృంభనతో రాష్ట్రంలో కొద్దికాలంలో సద్దుమణిగిన అంశాన్ని మరోసారి హాట్ టాపిక్ అయ్యేలా చేసి ఒక్క దెబ్బతో కన్నాకు, కిట్స్ కొనుగోలు వార్తలకు చెక్ పెట్టేలా ఎత్తు వేశారు.

పైగా కన్నాకు ఓ భారీ షాక్ కూడా ఇచ్చారు ఎంపీ విజయ సాయి రెడ్డి. కన్నా చేస్తున్న వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవాలు లేదని తేల్చి పారేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయని చెప్పారు. ఏది ఏమైనా కన్నా అమ్ముడుపోయారని పదే పదే బల్ల గుద్ది చెప్తూ.. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు.

విశాఖకు రాజధాని మార్పు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదన్నది స్పష్టంగా చెప్పేశారు. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదట కూడా. ఏది ఏమైనా విజయ సాయి రెడ్డి మరోసారి తన మాటల గారడీ చూపించేశారు. ఓ వైపు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాలు అన్నీ బాగున్నాయని చెప్పి కన్నాకు షాక్ ఇచ్చారు. మరో వైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల భాగోతం అంశాన్ని రాజధాని వివాదంతో వెనక్కి తోసేశారు.