Singer Asha Bhosle: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో ఎనిమిది దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన దిగ్గజ గాయని, పద్మ విభూషణ్ ఆశా భోంస్లే (92) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో యావత్ భారత దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.
శనివారం సాయంత్రం ఆశా భోంస్లే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ (Chest Infection) కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ విషాద వార్తను ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ధ్రువీకరించారు. “అమ్మ మనల్ని వదిలి వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోంస్లే, తన 10వ ఏటనే (1943) మరాఠీ సినిమా ‘మాఝా బాళ్’ ద్వారా గాయనిగా ప్రయాణాన్ని ప్రారంభించారు.

మెలోడీలు, ఘజల్స్, పాప్, జానపద గీతాలు.. ఇలా ఏ ప్రక్రియలోనైనా ఆమె తనదైన ముద్ర వేశారు. దాదాపు 20కి పైగా భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. 2023లో దుబాయ్లో జరిగిన తన 90వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మూడు గంటల పాటు నిరంతరాయంగా లైవ్ కచేరీ చేసి అభిమానులను విస్మయానికి గురిచేశారు.
సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ (2008), దాదాసాహెబ్ ఫాల్కే (2000) అవార్డులతో గౌరవించింది. అలాగే పలుమార్లు జాతీయ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు.
రేపు అంత్యక్రియలు- ఆశా భోంస్లే భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆమె నివాసం ‘కాసా గ్రాండే’లో ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సినీ రాజకీయ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

