‘కడప ఉక్కు’ మీద టిడిపి వెటకారం చూడండి (వీడియో)

తెలుగు దేశం పార్టీ కడప జిల్లాలో  ఉక్కు డ్రామా అడుతూ ఉంది. గత నాలుగేళ్లలో ఎపుడూ ఈ పార్టీ ఉక్కుమాటెత్తలేదు. అసలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి  కడప జిల్లా లో ఉక్కుఫ్యాక్టరీ వంటి పెద్ద ఇండస్ట్రీ రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక్కడ కుల రాజకీయాల గురించి చెప్పుకోవలసింది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తే రెడ్డి పొలిటిషియన్లు హైజాక్ చేసుకుపోతారని ఆయన భయం. అందుకే కడప ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతానికి ఎంత ప్రయోజనం ఉన్నా తెలుగుదేశానికి ప్రయోజనం  ఉండదేమో అనే అనుమానంతో ఆయన  ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకోవడం లేదు. నిజానికి కొన్నిలక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్న పెద్ద మనిషి ఒక స్టీల్ ఫ్యాక్దరీకి తన పలుకుబడి, అనుభవం ఉపయోగించి పెట్టుబడులు సమకూర్చ లేడా? కేంద్రం స్టీల్  ప్లాంట్ ఏర్పాటుచేయలేనపుడు ప్రయివేటు క్యాపిటల్ తీసుకురావచ్చు. అయితే, గత నాలుగేండ్లలో ఆయన ఇలాంటి ప్రయత్నం చేయనేలేదు. అంగుళం కూడా కదలిందేకు వీలుకాని రాజధాని అమరావతి కోసం ఆయన, ఆయన మంత్రులు, అధికారులు కోట్లకు  కోట్ల కు ఖర్చు పెట్టి ప్రపంచ దేశాలన్నీ తిరిగొచ్చారు. అయితే స్టీల్ ప్లాంట్ ను నిజం చేసేందుకు రాజధాని శ్రమలో కనీసం ఒక వంతు కృషి చేసినా  ఈ ప్లాంట్ ఇప్పటికే మొదలయి వేలాది మందికి ఉపాధినిచ్చేది.

ప్లాంట్ కోసం ప్రయత్నం చేయకపోవడమే కాదు, ఈ ప్లాంట్ డిమాండ్ టిడిపి ఎంపిలెవరికీ సదభిప్రాయం లేదు. నాలుగేళ్లుగా జిల్లా విద్యార్థులు, యువకులు స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఏర్పాటుచేసుకుని పోరాడుతూ ఉంటే ఒక్క మాటకూడా మాట్లాడని టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఇపుడు ఏకంగా నిరాహార దీక్ష కు పూనుకున్నారు. ఈ దీక్ష అంటే టిడిపి వారిలో ఎంత హేళన భావం ఉందో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.  ఈ వెటకారం నిరాహార దీక్ష మీద అయినా,  కడప జిల్లా స్టీల్ ప్లాంట్ మీద ఏ మాత్రం వాళ్లకి సీరియస్ నెస్ లేదని, వస్తుందన్న విశ్వాసం లేదని అర్థమవుతుంది.