ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరిడికీ ముఖ్యమంత్రే. అంతేకానీ ఎన్నికలప్పుడు తన పార్టీకి ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి అని వేయని వారికి కాదని కాదు. పాలన అందరికీ ఒకేలా ఉండాలి.. ఎందుకంటే అందులో ప్రతి పౌరుడి సహకారం ఉంటుంది కాబట్టి. పోటీ ముగిసి సీఎం కుర్చీ ఎక్కాక తమ పర అనే బేధం ఉండకూడదు. ముఖ్యమంత్రికి అందరూ ఒకేలా కనబడాలి. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి అలా కనిపిస్తున్నట్టు లేదు.
వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఈరోజు ఒక్కో రైతుకు రూ.7500 ల ఆర్థిక సహాయం అందించారు. ఈ సంధర్భంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు జిల్లాల రైతులతో మాట్లాడారు. అందులో రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం, రైతు భరోసా కేంద్రాలు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి మంచి మంచి వ్యూహాల గురించి చెబుతూ మధ్యలో జగన్ కు ఓటు వేయని రైతైనా సరే పర్వాలేదు.. ఆ రైతన్నకు కూడా మేలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించాం అన్నారు.
ఓటు వేయని రైతైనా పర్వాలేదు అనే మాట ఓట్లు వేయని రైతులందరినీ ఇప్పుడు తాను క్షమించి వారికి కూడా సాయం అందిస్తున్నామనే అర్థం వచ్చేలా ఉంది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నుండి ఇలా జనాన్ని వేరు చేసే చూసే మాటలు రావడం ఏమాత్రం సభబు కాదు. ఓట్లు వేయనంత మాత్రాన వారి నుండి పన్నులు వసూలు ఆగలేదు, అభివృద్దిలో వారి కష్టం లేకుండా పోదు, వారి హక్కులేమీ హరించుకుపోవు. అందరితో పాటే వాళ్ళు కూడా. వీలైతే వచ్చే దఫా ఎన్నికల్లో వారి ఓట్లు కూడా వేయించుకునేంత మెప్పుగా పనితీరు ఉండాలి కానీ ఇలా తారతమ్యపు ధోరణి అస్సలు కనిపించకూడదు.
