ఎల్లోమీడియా బురద రాజకీయానికి తాజా నిదర్శనం

జగన్మోహన్ రెడ్డి పై ఎల్లోమీడియా ఏ స్ధాయిలో బురద రాజకీయం చేస్తుందనటానికి ఇదే తాజా నిదర్శనం. సిఎం అయిన తర్వాత కోర్టు విచారణ నుండి వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్ కోర్టుకు లేఖ పెట్టుకున్నారు. జగన్ విజ్ఞప్తిని సహజంగానే  సిబిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కోర్టు ఇష్టం. కానీ ఇంతలోనే జగన్ వాదనకు వ్యతిరేకంగా సిబిఐ వాదనను బలంగా వినిపిస్తు ఎల్లోమీడియా ప్రత్యేక కథనాలను వండి వార్చేస్తోంది.

ఎల్లోమీడియా ప్రత్యేక కథనాలను  చూస్తుంటే జగన్ ను ఎలాగైనా సరే సిఎం హోదాలో కోర్టులో హాజరయ్యేట్లు చూడాలన్నట్లుగా ఉంది. ఒకసారి జగన్ సిఎం హోదాలో కోర్టు విచారణకు హాజరైతే రాజకీయ ప్రత్యర్ధులు  చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, బిజెపి, వామపక్షాలు ఏ స్ధాయిలో చెలరేగిపోతారో కొత్తగా చెప్పక్కర్లేదు. అవకాశం దొరికినా దొరక్కపోయినా  జగన్ పై  బురద చల్లుతున్న వీళ్ళు జగన్ కోర్టు కు హాజరైతే ఊరుకుంటారా ?

సాక్ష్యులను జగన్  బెదిరించటం, ప్రలోభాలకు గురిచేస్తారనటానికి విచారణలో వ్యక్తిగత మినహాయింపు కోరుకోవటానికి సంబంధమే లేదు. సాక్ష్యులను బెదిరించటం, ప్రలోభాలకు గురి చేయగలిగిన వ్యక్తి విచారణకు కోర్టుకు హాజరైనపుడు సిఎం హోదాలో ఆపని చేయలేరా ?  

సిబిఐ వాదన చూస్తుంటే తెరవెనుక రాజకీయ కారణాలతోనే జగన్ విజ్ఞప్తిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఒకవైపు జగన్ పై నమోదైన కేసుల్లో ఒక్కోటి వీగిపోతున్నాయి. ఈ దశలో కూడా జగన్ విజ్ఞప్తిని సిబిఐ ఇంత బలంగా వ్యతిరేకిస్తోందంటే ఏమిటర్ధం ?  పైగా దానికి పనిగట్టుకుని ఎల్లోమీడియా బురద రాజకీయం ఏమిటో ?