నంద్యాల ఫరూఖ్ మంత్రి అవుతాడా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు సీరియస్ గా రెడీ అవుతున్నారు. నాలుగేళ్లుగా మాట వరసకు కూడా ప్రస్తావించని అనేక విషయాలు ఒకటొకటే ఇపుడు గుర్తు కొస్తున్నాయ్. ఇక జాప్యంచేయకూడద్నంత హడావిడి చేస్తున్నారు. కడప ఉక్కు గురించి ఎంత హడావిడి చేశారో చూస్తున్నారుగా. ఇపుడు ఆయన మరొక విషయం గుర్తుకొచ్చింది, అదే క్యాబినెట్ లో ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేదన్నది. ఇది అన్యాయమని తెగ ఫీలయిపోతున్నారు. అందుకని వెంటనే ఒక ముస్లిం శాసన సభ్యుని ఎంపిక చేసి మంత్రిని చేయాలనుకుంటున్నారని టిడిపి వర్గాల్లో వినబడుతూ ఉంది. ఇద్దరు ముస్లిం సభ్యులు వైసిపి నుంచి వలస వచ్చే దాకా టిడిపిలో ముస్లిం ఎమ్మెల్యేలెవరూ లేరు.  ధీనికి కారణం, ఆయన 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని, ముస్లిమ్ లను బాగా ద్వేషించే మోదీనిమోదం కల్గించడమే. ఒక్కముస్లిం అభ్యర్థికి కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు.  ఇపుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ఆయనకు క్యాబినెట్ లో ముస్లింలే రనే విషయం గుర్తుకొచ్చి గుచ్చకుంటూ ఉంది.

దీనికోసం స్పెషల్ క్యాబినెట్ విస్తరణ చేపడతారట. చేసే ముందు తానింతవరకు ముస్లిం మంత్రిని  ఎందుకు తీసుకోలేదు చెబుతారా?

బిజెపిని మురిపించేందుకే ఆయన క్యాబినెట్ లో ముస్లింలకు చోటీయలేదని అందిరికి తెలుసు. దానిని ఎలా చెబుతారో చూడాలి.  ఈ మధ్య బిజెపితో తెగతెంపులుచేసుకున్నాక  ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రాజీనామా చేశారు. ఈ ఖాళీలను పూరించే పేరుతో ఆయన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టి ఒక ముస్లిం సభ్యడికి ఆవకాశం ఇస్తారని చెబుతున్నారు.  సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాదే జరిగే అవకాశం ఉండటంతో ఆయన ఇక జాప్యం చేయకుండా ఒక ముస్లిం సభ్యుడిని  మంత్రి వర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. లేకపోతే,  ముస్లింలు బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో వైసిపి  అంశాన్ని బాబు మీద సీమ బాంబులాగా  ప్రయోగించవచ్చు. దానికి తోడు ముస్లింలు ప్రతిపక్ష పార్టీతో ఉన్నారని చాలా సర్వేల్లో వెల్లడయిందట.

ఇంతకీ ఎవరీ ముస్లిం భాగ్యశీలి…  పేరుమోసిన జలీల్ ఖానా, లేక చాంద్ బాషానా. వీరిద్దరు వైసిపి నుంచి వచ్చిన వారే. వీళ్లకిస్తే, తొలినుంచి పార్టీలో ఉన్న వాళ్లు బాధపడే అవకాశం ఉంది. దానికి తోడు జలీల్ ఖాన్  ఈ మధ్యే వక్ఫ్ బోర్డు ఛెయిర్మన్ కూడా అయ్యారు. కాబట్టి ఆయనకు క్యాబినెట్ కు తీసుకువచ్చే అవకాశమే లేదు. చాంద్ బాష…ఎపుడో వార్తల్లో ఉండడు. ఇక మిగిలింది ఇద్దరు ఎమ్మెల్సీలు.  ఇందులో ఒకరు కోస్తాంధ్ర షరీఫ్, మరొరకరు రాయలసీమ ఎన్ ఎండి ఫరూర్. ఫరూక్ మాజీ మంత్రి. గతంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. ఇపుడాయనుకు కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. ఫరూక్ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నాయకుడు.  అక్కడ ముస్లంలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల  వాళ్లను కొంత ప్రభావితం చేసేందుకు ఫరూక్ కు ఆ అవకాశం ఇచ్చే వీలుందని చెబుతున్నారు.  అందువల్ల ఆయన క్యాబినెట్ లోకి తీసుకువచ్చి, కౌన్సిల్ ఉపాధ్యక్షుడు మరొకరిని నియమిస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని టిడిపి వర్గాల్లో వినపడుతూ ఉంది. కర్నూలు జిల్లా టిడిపి వర్గాలు కూడా  ఈ పదవి ఫరూక్ కే దొరకవచ్చని ఆశిస్తున్నాయి. బాగానే ఉంది,  మరి కర్నూలు జిల్లాకు రెండు మూడు మంత్రి పదవులవుతాయి. ఇప్పటికే కర్నూలు జిల్లానుంచి ఒక డిప్యూటీ సిఎం(కెయి కృష్ణమూర్తి). ఒక మంత్రి (అఖిల ప్రియ వున్నారు). ముచ్చటైన మూడో మంత్రిగా ఫరూక్ వస్తారా? అది అత్యాశా?