ఆడిట్ రిపోర్ట్ మెలిక పెట్టి కేంద్రం పోలవరం ఆపుతుందా?

Polavaram

ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం 2021 జూన్ నెల నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టు ప్రతినిధులను ఆదేశించారు. ఎందుకంటే జూన్ తర్వాత గోదావరికి వరద వస్తే డిసెంబర్ వరకు పనులు జరిగే అవకాశం వుండదు.కాని గురువారం లోక్ సభలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి షెకావత్ టిడిపి సభ్యులు కేసినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని సమాధానం చెప్పారు.

అంతవరకైతే ఫర్వాలేదు. ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగాలంటే బాధ్యతంతా రాష్ట్ర ప్రభుత్వంపై వుందని తేల్చేశారు. ఇటీవల విడుదల చేసిన 1850 కోట్ల రూపాయలతో కలుపు కొని కేంద్రం ఇప్పటి వరకు 8614.16 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు చెప్పారు. ఆపైన ఇంకో మెలిక పెట్టారు. 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధుల గురించి ఆడిట్ రిపోర్టు 2013-14లో సవరించిన అంచనాల పంపమని తాము పలు మార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేదని ఈ వివరాలు అందిన తర్వాతనే ఇక తాము నిధులు విడుదల చేస్తామని బాల్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనికి నెట్టారు.ఆడిట్ రిపోర్టు పోతే తప్ప నిధులు అందవు.

మరో విశేషమేమంటే ప్రాజెక్టు తాజా అంచనాలు 54 446 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8614 కోట్ల రూపాయలతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 17 వేల కోట్లు వ్యయం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో 2014 కు మునుపు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన దాదాపు ఆరేడు వేల కోట్ల రూపాయలు తాము తిరిగి ఇవ్వమని కేంద్రం ఎప్పుడో తేల్చి వేసింది. తాజాగా సవరించిన అంచనాలను కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా మండలి ఆమోదించినా ఆర్థిక శాఖ ఆమోద ముద్ర ఇంకా పడలేదు.
ఇదిలా వుండగా తాజా అంచనాల మొత్తం వ్యయంలో ఖర్చయిన మొత్తం తీసివేస్తే కనీసం కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు ఇవ్వవలసి వుంది. ఇంత మొత్తం 2021 డిసెంబర్ లోపు కేంద్రం ఇచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. మరో విశేషమేమంటే కేంద్రం ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు ఒక్క పైసా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ డాంబికాలే.

ఇటీవల ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సందర్భంలో ఇచ్చిన పోగ్రాం ప్రకారమైనా ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే కనీసం ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమౌతుంది. వాస్తవం చెప్పాలంటే కేంద్రం ఈ మేరకైనా నిధులు ఇచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుండి నిధులు విడుదల చేయలేదు. పోలవరం ప్రాజెక్టు మాటల గారడీలో చిక్కుకున్నది. కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తికావాలని నిజంగా భావించితే ఎప్పటివో నిధుల వ్యయం ఆడిట్ రిపోర్టు అడ్డం పెట్టి ప్రస్తుతం నిధుల విడుదలకు బ్రేక్ వేసి వుండేది కాదు.

వి. శంకరయ్య 9848394013