అడ్డంగా బుక్కైపోయిన టిడిపి

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాలు మండిపోతున్నారు అని చాటి చెప్పే తొందరలో తనకు తానుగా టిడిపి సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే వరదలు వచ్చిన విషయం తెలిసిందే కదా ? ఆ వరదల్లో ఓ బాధిత రైతు ప్రభత్వాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. పనిలో పనిగా ’గొడ్లు కాచే వాడికి, గొర్లు కాచుకునే వాడికి మంత్రి పదవి ఇస్తే ఇలాగే ఉంటుంది’. అంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను ఉద్దేశించి చాలా ఘాటుగా తిట్టారు.

జగన్ ప్రభుత్వాన్ని తిడుతున్నామని అనుకున్నారే కానీ ఓ బిసి సామాజికవర్గాన్ని తిట్టిస్తున్నామని టిడిపి అనుకోలేదు. రైతు రూపంలో జగన్ ప్రభుత్వాన్ని, మంత్రిని తిట్టింది కూడా టిడిపి ఏర్పాటు చేసిన ఓ పెయిడ్ ఆర్టిస్టే అని వెంటనే బయటపడిపోయింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు గురించి బ్రహ్మాండంగా మాట్లాడించిన వ్యక్తితోనే ఇపుడు జగన్ ను తిట్టించింది లోకేష్ బాబే అని తెలిసిపోయింది.

బిసి సామాజికవర్గానికి టిడిపి చేసినంత మేలు ఎవరూ చేయలేదని చెప్పుకునే చంద్రబాబే ఇపుడు తమ మేధోతనంతో తయారు చేయించిన వీడియోలో బిసి మంత్రిని నోటికొచ్చినట్లు తిట్టించటం పెద్ద చర్చగా మారింది. నిజానికి మొన్నటి ఎన్నికల్లో బిసిల్లో అత్యధికులు టిడిపికే మద్దతు ఇచ్చారు. కొంతమంది బిసిలు వైసిపికి మద్దతిచ్చినంతలోనే టిడిపికి తల బొప్పికట్టింది. ఇపుడు మంత్రిని తిట్టించిన విషయమే పెద్ద చర్చనీయాంశమైంది.