‘యాత్ర 2’చిత్రం అఫీషియల్ ప్రకటన

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో నటించారు. వైఎస్సార్‌ చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది.

తన తండ్రిలాగే జగన్‌ సైతం పాదయాత్ర చేసి మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ఈ నేపథ్యంలో ‘యాత్ర’కు కొనసాగింపుగా ‘యాత్ర 2’ తీస్తానని రాఘవ్‌ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి రాఘవ్‌ ట్విటర్‌ వేదికగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు.

‘వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ జగన్‌ లేకుండా వైఎస్సార్‌ కథకు ముగింపు ఉండదు. ‘యాత్ర 2’ ద్వారా వీరి ముగ్గురి కథ గురించి చెప్పి సినిమాకు ముగింపు చెప్తాను. ‘యాత్ర’ సినిమాను జగన్‌ ప్రస్తావనతోనే ముగించేశాం. రెండో భాగంలో జగన్‌ ప్రయాణం గురించి చూపించాలనుకుని అలా చేశాం. వైఎస్సార్‌ యాత్ర ఆయన తండ్రి రాజా రెడ్డి సమాధి నుంచి మొదలైంది. జగన్‌ యాత్ర తన తండ్రి సమాధి నుంచి ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు రాఘవ్‌.

అన్నీ అనుకున్నట్టు కుదిరితే ‘యాత్ర 2’ సినిమాను కూడా మొదటి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డినే నిర్మిస్తారని తెలుస్తోంది.