బాలీవుడ్ లో ఈ టార్చర్ ఉండదుగా
ఆడియో ఈవెంట్లు- ప్రీరిలీజ్ ఈవెంట్లు అత్యంత భారీగా నిర్వహిస్తే సినిమాలు హిట్టవుతాయా? అంటే అలా జరిగిన సందర్భం ఒక్కటంటే ఒక్కటీ లేదు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అత్యంత భారీగా వేలాది మంది అభిమానుల సమక్షంలో వందలాది ఈవెంట్లు జరిగితే యథావిధిగానే ఐదు శాతం సక్సెస్ రేటు మాత్రమే టాలీవుడ్ కి ఉంది. హైదరాబాద్ లోని అన్ని స్టార్ హోటళ్లలో భారీ ఈవెంట్లు నిర్వహించారు. కానీ అలా ఈవెంట్లు జరుపుకున్న వాటిలో సక్సెసయినవి ఎన్నో పరిశ్రమ వర్గాలకు తెలుసు. అయితే ఇలా ప్రమోషనల్ ఈవెంట్లతోనే ఇటీవల సినిమాలు సక్సెసవ్వడం అన్నది కుదరదు. అయినా ఎందుకని గంటల కొద్దీ సమయాన్ని కైంకర్యం చేస్తూ ఇంత భారీగా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఒక్కో సినిమా ఈవెంట్ కి ఒక పూట పైగా ఎందుకు జనం కేటాయించాల్సి వస్తోంది? టాలీవుడ్ లోనే ఎందుకీ రోత? అంటూ ప్రస్తుతం సినీవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
గత మూడు నాలుగేళ్ల క్రితం కేవలం ఆడియో ఫంక్షన్ కీలకంగా జరిగేది. ఇప్పుడు ప్రీరిలీజ్ లు అంటూ ఒక్కో పాటను రిలీజ్ చేయడం.. ప్రతిసారీ ఈవెంట్ లాగా ప్రమోషన్ చేసుకోవడం.. గంపగుత్తగా ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి పూటల కొద్దీ ప్రెస్ వాళ్ల విలువైన సమయాన్ని.. అభిమానుల టైమ్ ని అడ్డంగా తినేయడం సత్తు కాలం వ్యాపకంలా మారింది. ఇంతసేపు ఈవెంట్లలో కూచుని ఎవరైనా వెలగబెట్టేది ఏదైనా ఉందా? అంటే అదేమీ లేదు. ఏదో ఎగ్జయిట్ మెంట్.. క్షణికమైన ఆనందం మినహా ఈవెంట్లకు వెళ్లే అభిమానులకు ఒరిగేదేం లేదు. ఇకపోతే ఇలాంటి భారీ ఈవెంట్లను టీవీల్లో చూసేవాళ్లకు పూటల కొద్దీ విలువైన సమయం వృథాగా ఖర్చయిపోతోంది. ఆ మాత్రం భజన బాకా కార్యక్రమాల కోసం అన్నేసి గంటలు వెచ్చించడం అవసరమా? అనుకున్నవాళ్లంతా కేవలం యూట్యూబ్ లపైనే ఆధారపడుతున్నారు. అది కూడా అతిధులంతా విచ్చేసి చివర్లో ఏం మాట్లాడతారో అది మాత్రమే వినేందుకు ఓపికపడుతున్నారు.
టాలీవుడ్ లో మునుముందు ఈవెంట్ల శైలి మారకపోతే వీటన్నిటినీ ఇక యూట్యూబ్ లో చూసే పరిస్థితే దాపురించనూ వచ్చన్న భావనా వ్యక్తమవుతోంది. ఇకపోతో మొన్న రామోజీ ఫిలింసిటీలో జరిగిన సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ని 1.4కోట్ల మంది వీక్షించారు. అయితే అంతకుముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `అజ్ఞాతవాసి` ఈవెంట్ కి 1.5 లైవ్ వ్యూస్ దక్కాయట. అంటే ఇప్పుడు లైవ్ లు చూసేవాళ్ల సంఖ్యా తగ్గుతోందనే దాని అర్థం. ప్రీరిలీజ్ ల పేరుతో యాంకర్ భజంత్రీలు.. ఏవీల రోత.. మధ్యలో డ్యాన్సులు- పాటల వాతలు ఇవన్నీ చూస్తూ కూచునేంత టైమ్ మోడ్రన్ జనాలకు లేనేలేదు. ఇప్పుడున్న పని ఒత్తిళ్లలో పూటల కొద్దీ సమయం ఈవెంట్ల కోసం కేటాయించి వీక్షించే అవకాశం లేదు. పైగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే అభిమానులకు సరైన వసతుల్లేకపోతే మునుముందు ఈ ఉత్సాహం తగ్గిపోవడం ఖాయం. ఇలాంటి భజంత్రీ ఈవెంట్ల స్థానంలో సినిమా కంటెంట్ పైనే మరింతగా దృష్టి సారిస్తే బెటర్. ఇక ఈ విషయంలో బాలీవుడ్ వాళ్లు ఎంతో స్ఫూర్తిదాయకం అని పలువురు విశ్లేషిస్తున్నారు. షార్ప్ గా ప్రెస్ మీట్ టైమ్ చెప్పి చకచకా వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లే బాపతు వందరెట్లు బెటర్ అని అంటున్నారంతా. ఇకపోతే టీవీల వాళ్లకు రైట్స్ అమ్ముకుంటేనో లేదా టీఆర్ పీ – యాడ్ రెవెన్యూ అంటూ ఆట ఆడదలిస్తే అది ఇలా జనాల టైమ్ తినేసే భజంత్రీ కార్యక్రమంలా కాకుండా రికార్డెడ్ కార్యక్రమం చేసుకుని తర్వాత తీరిగ్గా ఎడిట్ చేసి చెత్తంతా తీసేసి టీవీల్లో వేస్తే బెటర్ ఏమో!
