‘ఓటర్‌’ రిలీజ్ ఆపమని బెదిరింపులు

ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మంచు విష్ణు ఓటు పవర్ చెప్తానంటూ‘ఓటర్’ సినిమా చేసాడు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎపుడో విడుదల కావాల్సింది. కానీ హీరోకు, దర్శకుడికి మధ్య విభేధాలు, వివాదాల కారణంగా ఈ సినిమా విడుదల లేటేంది. సురభి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నాజర్, సంపత్, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రల్లో నటించారు. అయితే రేపు రిలీజ్ అనగా ఈ రోజు ఈ సినిమా రిలీజ్ ఆపటం కోసం బెదిరింపులు వస్తున్నాయిట.

‘ఓటర్‌’ని విడుదల చేయరాదని ఎగ్జిబిటర్లు, బయ్యర్లకి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయట. నిర్మాత అయితే ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఇచ్చేసానని, ఆర్థికంగా సినిమా విడుదలకి ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేవని చెబుతున్నాడు. మరి ఈ చిత్రాన్ని విడుదల కానివ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నదెవరు? అనేది ట్రేడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరో ప్రక్క ఈ సినిమా విడుదల అని ప్రకటించడం తప్ప.. సినిమా ప్రమోషన్స్ ఏం లేవు. అసలు మంచు విష్ణు అయితే ఓటర్ లో తాను హీరో కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఓటర్ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. కానీ ఓటర్ నిర్మాత మాత్రం సినిమాని ఎలాగోలా అమ్మేసి గట్టెక్కాలని చూస్తున్నాడు.

అయితే ఓటర్ నిర్మాతకి ఇప్పుడు ఓటర్ సినిమా విడుదల విషయంలో అనేక అడ్డంకులు మొదలయ్యాయి. ఓటర్ సినిమాకి ఒక్క థియేటర్ కూడా దొరకడం లేదు. ఎన్నో సినిమాల మధ్య విడుదలవుతోన్న ఓటర్‌ ఇన్నిసార్లు వాయిదా పడడంతో ఈ చిత్రానికి అసలు క్రేజ్‌ లేకుండా పోయింది.