సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో చనిపోలేదా?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చ‌క్రి 40వ‌య‌సుకే ఆక‌స్మికంగా త‌నువు చాలించ‌డం అభిమానుల్ని క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే. అత‌డి మ‌ర‌ణానంత‌రం ఆ కుటుంబంలో గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. చ‌క్రి కుటుంబ స‌భ్యుల‌పై అత‌డి భార్య శ్రావ‌ణి పోలీస్ కేసు పెట్టారు. ఆస్తుల గొడ‌వ‌ల‌పైనా అప్ప‌ట్లో ఆస‌క్తిగా మాట్లాడుకున్నారంతా. తాజాగా ఆ ఇంట‌ గొడ‌వ మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది. ఈసారి చ‌క్రి భార్య శ్రావ‌ణిపై అత‌డి త‌ల్లి విద్యావ‌తి జూబ్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శ్రావ‌ణి కేసుకు కౌంట‌ర్ కేసును ఫైల్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. 

ఈ సండే జూబ్లీ పోలీస్ స్టేష‌న్ లో శ్రావ‌ణిపై చ‌క్రి త‌ల్లి విద్యావ‌తి కౌంట‌ర్ కేసు ఫైల్ చేశారు. చ‌క్రి చావుకు కార‌ణం నేనేనంటూ శ్రావ‌ణి అత‌డు మ‌ర‌ణించిన రోజున త‌న‌తో అందని… విష‌యం ఇచ్చి చంపార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు కార‌కులుగా శ్రావ‌ణి పేరు స‌హా ఆమె త‌ల్లిదండ్రులు సురేఖ‌, మ‌ధుసూధ‌న రావ్, సోద‌రుడు భ‌ర‌ద్వాజ్ ల పేర్ల‌ను ఫిర్యాదులో చేర్చారు. కేసును పున‌ర్విచారించాల‌ని .. త‌ప్పు చేసి దొర‌క‌కూడ‌ద‌నే త‌మ‌పై శ్రావ‌ణి ముంద‌స్తుగా కేసు భ‌నాయించింద‌ని ఆరోపించారు. అయితే ఈ గొడ‌వ‌లో నిజాలేంటో బ‌య‌ట‌ప‌డాలంటే క‌ష్ట‌మేన‌నేది పోలీసుల వ్య‌థ‌. క‌నీసం చక్రి భౌతిక ఖాయానికి పోస్ట్ మార్టమ్ కూడా నిర్వ‌హించ‌లేదు. అలాంట‌ప్పుడు రీపోస్ట్ మార్ట‌మ్ వంటివి కుద‌ర‌వు. ఇన్నాళ్ల త‌ర్వాత తిరిగి ఈ గొడ‌వ‌లు రిపీట‌వుతుండడంతో వీటికి ప‌రిష్కారం ఎలా? అన్న డైల‌మా పోలీసుల్లో క‌నిపిస్తోంద‌ట‌. ఇలా చ‌క్రి మ‌ర‌ణించి ఇన్నిరోజుల త‌ర్వాత తిరిగి కుటుంబ క‌ల‌హాల‌తో ర‌చ్చకెక్క‌డంపై అభిమానుల్లో ఆవేద‌న క‌నిపిస్తోంది. ఇలా అయితే చ‌క్రి ఆత్మ‌కు శాంతి క‌లుగుతుందా? అని అభిమానులు కాస్తంత నిర్వేదం వ్య‌క్తం చేస్తున్నారు.