‘టాక్సీవాలా’  పైరసీ చేసింది మరెవరో కాదు…అంతా షాక్

తెలుగు సినిమా పరిశ్రమను పైరసీ భూతం ఎప్పటికప్పుడు ఛాలెంజ్ లు విసురుతూ తనని ఏమీ చెయ్యలేరని వెక్కరిస్తూనే ఉంది. పెద్ద సినిమావాళ్లు రిలీజ్ కు ముందు నుంచే పైరసీ కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే సినిమా రిలీజ్ కాకుండానే పైరసీ ఆలోచన ఎందుకు వస్తుంది. అదే ఒక్కోసారి దెబ్బ కొడుతోంది. తాజాగా  విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమా పైరసీ భారిన పడటంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. దాని నుంచి కోలుకుంటున్న … సమయంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మరో సినిమా టాక్సీవాలా కూడా పైరసీకి గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో కొంత మంది ఆకతాయిలు మొబైల్‌లో టాక్సీవాలా సినిమా చూస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ కేసు నమోదు చేసిన పోలీసులు వారికి సినిమా ఎక్కడి నుంచి వచ్చింది. వారు ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారన్న విషయాలను ఆరా తీస్తే అసలు విషయం బయిటకు వచ్చింది.  ఇంటిదొంగే ఈ దొంత ప‌ని చేశాడ‌ట‌.  ఎడిటింగ్ విభాగానికి చెందిన ఓ వ్యక్తే దీనికి కారణంగా తేలింది. దాంతో అతనా పైరసీ చేసింది అని యూనిట్ లో అంతా  షాక్ అయ్యారట. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు పోలీసులు.

 విజయ్‌ దేవరకొం‍డ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌,
గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్‌ సరసన మాళవిక నాయర్‌, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్‌ కావాల్సి ఉంది. ఈ హడావిడితో  అక్టోబరు నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెల‌ప‌డం విశేషం.