టీవీ సీరియ‌ల్ యూనిట్‌కి టెస్టులు.. రిపోర్ట్ ఇదే!

టీవీ న‌టుడికి క‌రోనా పాజిటివ్ అన్న వార్త ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. జీతెలుగులో సూర్య‌కాంతం సీరియ‌ల్ స‌హా మ‌రో సీరియ‌ల్ తో బిజీగా ఉన్న న‌టుడు ప్ర‌భాక‌ర్ కి పాజిటివ్ అని తేల‌గానే చిత్ర‌బృందాల్లో ఆందోళ‌న మొద‌లైంది. సూర్య‌కాంతం సీరియ‌ల్ యూనిట్ లో ఏడుగురికి క‌రోనా టెస్టులు చేశార‌ని తెలుస్తోంది. ఆ ఏడుగురి ప‌రిస్థితి ఏమిటి? అని ప్ర‌శ్నిస్తే.. ఆందోళ‌న చెందాల్సిన‌దేమీ లేద‌ని అంద‌రికీ నెగెటివ్ వ‌చ్చింద‌ని తెలిసింది.

అయితే ఈ ఘ‌ట‌న తో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యింది. టీవీ సీరియ‌ళ్ల షూటింగుల్ని తిరిగి ఆపేయాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. అందుకు ఆసోసియేన్ల‌లోనే రివ‌ల్యూష‌న్ వ‌చ్చేసింద‌ట‌. ఇప్ప‌టికే సినీహీరోలు ఎవ‌రూ షూటింగుల‌కు వెళ్లేందుకు సిద్ధంగా లేక‌పోవ‌డంతో ఇంకా పెద్ద తెర షూట్లు మొద‌ల‌వ్వ‌లేదు. తాజా ఇన్సిడెంట్ తో అలెర్ట‌యిన హీరోలు ఇప్ప‌ట్లో సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా లేర‌ని తెలిసింది.