నార్త్కి దిమ్మ తిరిగే ట్రీట్ ఇస్తున్న దక్షిణాది
ఒకప్పుడు 50 కోట్లు.. 100 కోట్లు అనేదే అందనంత దూరం. ఆ రేంజు ఇండియాలో బాలీవుడ్ వరకే సాధ్యం. బాలీవుడ్ కి జాతీయ స్థాయి మార్కెట్ ఉంది. ప్రాంతీయ భాషలకు అంత సీన్ అన్నదే లేదు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్ వరకూ అయినా తిరిగి వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ కాలం మారింది. బాలీవుడ్ కు ధీటుగా దక్షిణాది సినిమా ఎదగడం మొదలైంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం ఒక్క బాలీవుడ్ కే పరిమితం అనే కండీషన్ లేదిప్పుడు. `బాహుబలి` తరువాత దేశంలో దక్షిణాది చిత్రాలదే పైచేయిగా మారుతోంది. అక్కడ సినిమాలకు ధీటుగా మనం కూడా ఎదిగేస్తుండడం కొత్త పరిణామం. ఇది బాలీవుడ్ సైతం ఊహించనిది.
దర్శకధీరుడు రాజమౌళి సాహసం దరిమిలా `బాహుబలి` ఇచ్చిన ధైర్యంతో పాన్ ఇండియా స్థాయి చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. ఇటీవల విడుదలైన `సాహో`,`సైరా` పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకుని ఆ స్థాయి కేటగిరీ చిత్రాల జాబితాలో చేరిపోయాయి. దక్షిణాది చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ పెరగడం, డిజిటల్ రైట్స్కి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి ప్లాట్ ఫామ్లలో కూడా బాగా డిమాండ్ ఏర్పడటంతో దక్షిణాదిలో పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని తెరపైకి తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ కోవలోనే మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి ఘనవియం మరో మెట్టు ఎక్కేందుకు సహకరిస్తోందన్నది ఓ విశ్లేషణ. ఈ చిత్రం మొదటి రోజు 80కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ వారం దసరా సెలవులతో భారీ వసూళ్లను అంచనా వేస్తున్నారు. విజయం ప్రతిసారీ ఉత్సాహాన్నిస్తుంది. ఆ ఉత్సాహం మరోసారి టాలీవుడ్ లో కనిపిస్తోంది.
ప్రస్తుతం దక్షిణాదిన నిర్మాణంలో ఉన్న పాన్ ఇండియా సినిమాలేవి అంటే.. మోహన్లాల్ నటిస్తున్న `మరక్కార్ : అరబికడలైంట్ సింహం` దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోంది. సునీల్ షెట్టి, అర్జున్, కిచ్చా సుదీప్, ప్రభు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఇక ఇదే స్థాయిలో మమ్ముట్టి నటిస్తున్న `మమాంగం` ఆసక్తి పెంచుతోంది. పద్మకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. మలయాళ, తెలుగు భాషలతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతోంది. హిస్టారికల్ ఫిక్షన్ కాకుండా మరికొన్ని పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అవి కూడా ఆసక్తి కలిగించేవే. తెలుగులో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. దీన్ని కూడా సుధీర్ బాబు కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు. జయలలిత బయోపిక్ ఆధారంగా కంగన రనౌత్తో ఎ.ఎల్. విజయ్ రూపొందిస్తున్న `తలైవి`… నిత్యామీనన్-ప్రియదర్శినిల కలయికలోని ది ఐరన్ లేడీ చిత్రాలుఉ కూడా భారీ స్థాయి పాన్ ఇండియా చిత్రాలే. వీటిని కూడా పాన్ ఇండియన్ స్థాయిలోనే రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఉత్తరాది ఇటువైపు చూడాల్సిన రోజులొచ్చాయి. వరుసగా సౌత్లో పాన్ ఇండియా స్థాయి చిత్రాలు ఊపందుకోవడంతో నార్త్ మేకర్స్కి ముఖ్యంగా బాలీవుడ్ వర్గాలకు దిమ్మదిరిగిపోతోందనే చెప్పాలి. ఈ పోటీ వల్ల ఉత్తరాదినా క్వాలిటీ కంటెంట్ తో ప్రయోగాలు పెరుగుతున్నాయి.
