ఉయ్యాల వాడ వారసులు .. వదల బొమ్మాళీ
గత కొంత కాలంగా టాలీవుడ్ చుట్టూ వివాదాలు అలుముకుంటున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా` కూడా అందుకు మినహాయింపు కాదని తాజా సన్నివేశం చెబుతోంది. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరపైకి వచ్చిన ఈ చిత్రానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులే విలన్లుగా మారారు. తమ వివాదం ఓ కొలిక్కి వస్తే తప్ప సినిమాని విడుదల చేయకూడదని ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. 23 మంది వారసులమైన తమకు ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున 46 కోట్లు చెల్లిస్తామని చిత్ర నిర్మాత రామ్చరణ్ మాటిచ్చాడని, తాజాగా ఆ మాట తప్పాడని ఆరోపిస్తూ సినిమా విడుదలని నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుల పిటీషన్ని స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.
దీంతో `సైరా` సినిమా రిలీజ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు నష్టపరిహారం చెల్లించకుండా తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని సదరు పిటీషన్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. మా నరసింహారెడ్డి కథని ఫ్రీగా తీసుకుని మమ్మల్ని మోసం చేశారని, న్యాయం కోసం పోరాడిన తమపైనే అక్రమ కేసులు పెట్టించారని ఈ సందర్భంగా పిటీషన్లో పొందుపరిచారు. దీంతో చిరు కలల ప్రాజెక్ట్ `సైరా` చుట్టూ నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంతకీ `సైరా` రిలీజ్ వుంటుందా? అంటే నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్చరణ్ ఎంత మేర నష్టపరిహారం చెల్లించాల్సి వుంటుంది?. నిజంగానే చెల్లిస్తారా?.. 46కోట్ల డిమాండ్ సరైనదేనా? ఉయ్యాలవాడ వారసులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా.. న్యాయబద్ధమైన పోరాటమేనా? అన్నది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.