సైరా ట్రైలర్ 2: మెగాస్టార్ రియల్ వారియర్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా: నరసింహారెడ్డి` అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళంలో ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజై యూట్యూబ్ లో దూసుకెళ్లింది. ఈ ట్రైలర్ కి జనాల నుంచి అద్భుత స్పందన వచ్చింది. బాహుబలి తర్వాత మరో విజువల్ గ్రాండియర్ చిత్రం టాలీవుడ్ నుంచి రెడీ అయ్యిందని జాతీయ స్థాయిలో చర్చ సాగింది.
తాజాగా సైరా రెండో ట్రైలర్ ని కొణిదెల ప్రొడక్షన్స్ కాంపౌండ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం యుద్ధ రంగంలో కదం తొక్కుతూ ఉయ్యాల వాడ వీరత్వం ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. మెగాస్టార్ వారియర్ కింగ్ పాత్రలో అద్భుతంగా నటించారని అర్థమవుతోంది. ముఖ్యంగా ఆంగ్లేయులతో తలపడుతూ యుద్ధ సన్నివేశాల్లో చిరు నటించిన తీరు మైమరిపించింది. ఈస్టిండియా కంపెనీ అరాచకాల్ని ఎదిరించే వీరుడిగా అతడి విరోచిత పోరాటాల్ని తాజా ట్రైలర్ లో ఆవిష్కరించారు.
అయితే ట్రైలర్లు .. వీడియోలతో ప్రచారం మాటేమో గానీ.. ఈ సినిమాకి ఇంకా వివాదాలు వదల్లేదా? ఇంకా కోర్టుల పరిధిలో సమస్య పరిష్కారం కావాల్సి ఉందా? అంటే అవుననే తెలుస్తోంది. ఓవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఈ సినిమాపై కోర్టుల పరిధిలో పోరాడటం పంటికింద రాయిలా అన్నిటికీ అడ్డు పడుతోంది. రిలీజ్ ముంగిట ఇదో అపశకునంలా తయారైంది. నిన్నటిరోజున కోర్టులో దీనిపై కీలక విచారణకు సంబంధించిన ప్రకటన వెలువడిందట. నేడు దీనిపై పూర్తి విచారణ చేపడుతున్నారని తెలుస్తోంది. సైరాకు కేటాయించిన బడ్జెట్ లో 10శాతం అంటే సుమారు 50 కోట్లు తమకు ముట్ట జెప్పాల్సి ఉంటుందనేది ఉయ్యాలవాడ కుటుంబీకుల ఆరోపణ. అయితే దీనికి కొణదెల అధినేతలు అంగీకరించడం లేదని అర్థమవుతోంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే మార్గం లేకపోవడంతో కోర్టుల్లో పరిష్కారం కోసం వేచి చూస్తున్నరట. అయితే అన్ని వివాదాల్ని పరిష్కరించుకుని సజావుగా రిలీజ్ అవుతుందని అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. ఇక మరోవైపు ఉయ్యాలవాడ చిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్దనే జాతీయ మీడియా సహా లోకల్ మీడియాతోనూ ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారని తెలుస్తోంది. అలాగే బెంగళూరు, ముంబై, కోల్ కతలో ప్రమోషన్స్ కి ప్లాన్ చేశారని తెలుస్తోంది.