మనసుకవి ఆత్రేయ చెప్పిన షాకింగ్ విషయాలు


(భగీరథ)

తెలుగు సినిమాను సగటు ప్రేక్షకుడు దగ్గరకు చేర్చిన రచయితల్లో ఆచార్య ఆత్రేయ మొదటి స్థానంలో ఉంటాడు . ఆయన మాటలు, పాటలు కూడా చక్కటి భావంతో , భాషతో వుంటాయని క్రిటిక్స్ చెబుతారు . అయితే రానురాను ఆయన మాటలు పాటల్లో డబల్ మీనింగ్స్, ద్వందార్ధాలు వస్తున్నాయని అందుకే కొందరు ఆయన్ని బూత్రేయ అని కూడా వ్యగ్యంగా పిలిచేవారు . ఏమైనా ఆత్రేయ తెలుగు సినిమాకు చేసిన సేవ చిరస్మణీయంగా ఉంటుందని చెప్పవచ్చు . గురువారం నాడు ఆత్రేయ 29వ వర్ధంతి . ఆత్రేయ భౌతికంగా మనకు దూరమై మూడు దశాబ్దాలు అవుతుంది . ఈ సందర్భంగా ఆయన ప్రతిభ గురించి, వ్యక్తిత్యం గురించి తెలుసుకుందాం .

ఆత్రేయ అసలు పేరు కిలాంభి వెంకట నర్సింహా చార్యులు . ఆయన 7 మే 1921న నెల్లూరు లోని మంగళంపాడు గ్రామంలో జన్మించాడు . హైస్కూల్ విద్యాభ్యాసం తరువాత ఆయన్ని క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్కొని జైలు జీవితం గడిపాడు . బయటికి వచ్చి కొంతకాలం చిన్న వుద్యోగం చేశాడు . తరువాత నెల్లూరులోని జమీన్ రైతు పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశాడు . అప్పటికే అనేక నాటకాలు , నాటకాలు రాసి స్టేజి మీద ప్రదర్శింప చేశాడు . వాటిని జనం బాగా ఆదరించారు , బహుమతులు కూడా వచ్చాయి .

ఆత్రేయ రాసినవాటిల్లో , భయం, విశ్వ శాంతి, కప్పలు, గౌతమ బుద్ధ , సామ్రాట్ అశోక , పరివర్తనం, ఎదురీత , తిరుపతి ప్రధానంగా పేర్కొన వచ్చు . ఆత్రేయ ప్రతిభను గమనించిన మిత్రులు సినిమా రంగంలోకి వెళ్ళమని ప్రోత్సహించారు . 1951లో కేఎస్ ప్రకాశరావు “దీక్ష ” అనే సినిమాలో ఆత్రేయను పరిచయం చేశాడు . ఈ చిత్రంలోని “పోరా బాబు పో ” అనే పాట ఆరోజుల్లో బాగా పాపులర్ అయ్యింది . అక్కడ నుంచి ఆత్రేయ సినిమా ప్రయాణం మొదలయ్యింది . మాటలు ,పాటలు రాస్తూ ఎంతో బిజీ గా ఉండేవాడు . ఆత్రేయ రాయక నిర్మాతల్ని , రాసి ప్రేక్షకులను ఏడిపిస్తారని అనుకునేవారు . ఆత్రేయ పెద్దగా చదువుకోక పోయినా జీవితానుభవంతో రాసేవాడు .

1989 లో విడుదలైన వెంకటేష్ , రేవతి నటించిన సురేష్ ప్రొడక్షన్ వారి ప్రేమ ఆయన ఆయన చివరి సినిమా. ఒక సినిమా పనిమీద ఆత్రేయ హైదరాబాద్ వచ్చి అశోక హోటల్లో వున్నప్పుడు .. ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవేదనతో చెప్పిన మాటలు .

1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు , సావిత్రి, జమున నటించిన “మూగమనసులు ” సినిమాలో ఆత్రేయ రాసిన ” మాను మాకును కాను .. రాయి రప్పను కానే కాను మామూలు మణిసిని నేను ..” పాట పెను దుమారం రేపిందట .

“అప్పట్లో ఈ పాట కాగితాలు నా ముఖంపై గిరాటేశారు . ఆత్రేయా మతి వుండే రాశావా ? తాగి తాగి ఉన్మాద స్థితిలో రాశావా ? మాను మాకును కాను .. రాయి రప్పను కానే కాను .. ఏమిటిది ? ఇది పాటా ? అని ఒకరకంగా ఎగతాళి చేశారు . ఆ సినిమాలో ఒక గొప్ప ప్రయోగం చేశానని నేను మురిసి పోతుంటే … ఈ మాటలు నన్ను అమితంగా బాధించాయి . కన్నీళ్లు ఉబికి వచ్చాయి . బలవంతంగా ఆపుకున్నా.. ఈ ఒక్క పాట నాకోసం ఉంచండి … మీలాగా జనం ఛీ కొడితే… నేను పాటలు రాయడం మానేస్తా , అని చెప్పాను . అలా ఆ పాటను ఉంచారు . అది ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలుసు .

ఇక అదే సంవత్సరం జగపతి రాజేంద్ర ప్రసాద్ తాను నిర్మిస్తున్న “ఆత్మ బలం ” సినిమాకు ఓ పాట రాయమని చెప్పాడు . ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావు, బి .సజోజాదేవి నటించారు . వి. మధుసూదన రావు దర్శకుడు . పాట రాయడానికి బెంగుళూర్ తీసుకెళ్లారు . అది సరదా ట్రిప్ అని రాజేంద్ర ప్రసాద్ గారు నాతో చెప్పారు . కానీ నాకు తెలుసు . మద్రాసులో ఉంటే రాయనని బెంగుళూరికి నను తీసు కెళ్లారు . అక్కడ పెద్ద హోటల్లో వున్నాం , వారం పది రోజులవుతున్నా పాట కాదు కదా పల్లవి కూడా రాలేదు . రాజేంద్ర ప్రసాద్ గారు పైకే అన్నారు , “డబ్బు అయిపోతుంది తప్ప పాట రా యడం లేదు” , అంటే నేను కావాలనే రాయడం లేదని ఆయన ఉద్దేశ్యం. నా మనస్సు చివుక్కు మంది . ఆరోజు సాయంత్రం టిఫిన్ తిని గబ్బన్ పార్క్ లో విహరించడానికి తీసుకెళ్లారు . పార్కు లో తిరుగుతూ ఉండగానే చినుకులు పడటం మొదలయ్యాయి . పార్క్ కు వచ్చిన జంటలు చెట్టు నీడకు వెడుతుండగా “ఆత్మబలం ” సినిమా పాటకు పల్లవి ఆశువుగా వచ్చేసింది . “అదే చిటపట చినుకులు పడుతూవుంటే .. చెలికాడే సరసన ఉంటే.. “.

పాట పుట్టుక పాపాయి పుట్టుక వంటిది అన్నారు . మంచి పాటకోసం చాలా కాలం వేచి వుండాల్చి వస్తుంది ” అని ఓ నిట్టూర్పు విడిచారు ఆత్రేయ.
మనసు కవి ఆత్రేయ ఎన్నో విలక్షణ మైన పాటలు రాశాడు . పది కాలాలపాటు అవి ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటాయి .

(ఫోటో కర్టసీ acharyaathreya.blogspot.com)