చిరు గెస్ట్‌గా ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌నున్నారు. తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఈ నెల 25(ఆదివారం)న ఉద‌యం 10.11 నిమిషాల‌కు ఆవిష్క‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వాన ప‌త్రిక అందింది. ఇదివ‌ర‌కూ ఎస్వీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ప‌.గో జిల్లా ఏలూరులో ఆయ‌న కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

నాన్న‌గారు ఆయ‌న‌కు స‌హ‌న‌టుడు

ఇటీవ‌ల ఎస్‌.వి.రంగారావు ఫొటో బయోగ్రఫి `మహానటుడు` పుస్తక ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో చిరు మాట్లాడుతూ తాను న‌టుడు అవ్వ‌డానికి స్ఫూర్తినిచ్చిన గొప్ప న‌టుడు ఎస్వీఆర్ అని తెలిపిన సంగ‌తి మ‌రువ‌లేం. ముఖ్యంగా ఎస్వీఆర్ నటన చూసి ఎంతో నేర్చుకున్నాన‌ని  ఆయనో ఎన్ సైక్లో పీడియా అని చిరు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఎస్వీరంగారావు కాంబినేషన్ లో నాన్నగారు నటించారు అంటూ టాప్ సీక్రెట్ ని మెగాస్టార్ ఆ వేడుక‌లో వెల్ల‌డించారు. నాన్న‌గారు ఇంటికొచ్చి సెట్స్ లో ఏం జరిగింది? రంగారావు గారు ఎలా మాట్లాడతారు? ఎలా నటిస్తారు? లాంటి విషయాలు చేసి చూపిస్తుండేవార‌ని మ‌హా న‌టుడిపై త‌న అభిమానం చాటుకున్నారు.