రంభ‌కు కొడుకు పుట్టాడు!

                                                  (ధ్యాన్)

నిన్న‌టిత‌రం హీరోయిన్ రంభ ఈ నెల 23న పండంటి మ‌గ‌బిడ్డ‌ను జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని ఆమె భ‌ర్త ఇంద్ర‌న్‌ ప‌ద్మ‌నాథ‌న్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. తాను, త‌న భార్య క‌లిసి కొడుకును స్వాగ‌తిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. వారికి ఇప్ప‌టికే ఇద్ద‌రు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె పేరు లాన్య‌, రెండో కుమార్తె సాషా. ఇప్పుడు పుట్టింది మూడో సంతానం. గ‌త కొంత కాలం క్రితం వ‌ర‌కు కూడా రంభ త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందులో నిజం ఉంటే తానే స్వ‌యంగా వెల్ల‌డిస్తాన‌ని కూడా అప్ప‌ట్లో రంభ అన్నారు. అయితే ఇప్పుడు అన్నీ స‌మ‌సిపోయాయి. ఇంద్ర‌న్‌, రంభ కుటుంబం కెన‌డాలో ఉంటోంది. త‌న‌కు పెళ్ల‌యిన‌ప్ప‌టి నుంచీ రంభ కెన‌డాలోనే ఉంటున్నారు.