నేను పోలీసు కస్టడీలో ఉన్నా: రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా చెప్పారు. ట్విటర్‌లో తన వీడియోను షేర్‌ చేస్తూ.. ‘నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు కస్టడీలో ఉన్నా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదు’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

‘నేనేమైనా ఉగ్రవాదినా… నన్ను ఎందుకు నిర్బంధించారు. నిర్బంధించడానికి ఎలాంటి హక్కు, అధికారం ఉంది.’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఆయన ప్రశ్నలకు మాత్రం పోలీసులు సమాధానం ఇవ్వలేదు. తన నిర్బంధంపై రాంగోపాల్‌ వర్మ…. ‘నేను నిజం చెప్పేందుకు యత్నిస్తే ఏపీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు అంటూ ఈ సందర్భంగా ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను మే 1న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయబోతున్నట్లు వర్మ శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వర్మ విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమ చిత్ర బృందం ఆ హోటల్‌లో బసకు దిగకుండా వార్నింగ్‌ ఇచ్చారని, అందుకే బుకింగ్‌ రద్దు చేశారని వర్మ కొన్ని గంటల ముందు ట్వీట్‌ చేశారు. దీంతో పైపుల రోడ్డులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర నడిరోడ్డు మీద ప్రెస్‌మీట్‌ నిర్వహించబోతున్నామని వర్మ మీడియాను కార్యక్రమానికి ఆహ్వానించారు. అంతేకాదు తమకు గది ఇవ్వడానికి విజయవాడలోని ఏ హోటల్‌ ధైర్యం చేయలేదని, వారందరికీ వార్నింగ్‌ ఇచ్చారని వర్మ ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో వర్మ తాజాగా వీడియోను షేర్‌ చేశారు. ‘మా కార్లను ఆపి, మమ్మల్ని బలవంతంగా వేరే కార్లలో ఎక్కించారు. విజయవాడకు రావడానికి వీలులేదు అని వార్నింగ్‌ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి విమానాశ్రయంలో పడేశారు. ఎందుకు ఇలా చేశారనేది నాకు అర్థం కావడం లేదు. పోలీసులు చట్టపరంగా వ్యవహరించరా?.. వారికి బాధ్యత లేదా?. విజయవాడకు రావడానికి వీలులేదు, ఏ హోటల్‌లోనూ ఉండటానికి వీలు లేదు అని చెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను, నా నిర్మాత ఎంత అడిగినా పోలీసులు సమాధానం చెప్పకుండా ఇలా మమ్మల్ని విమానాశ్రయంలో పడేశారు. అప్‌డేట్స్‌ చెప్పడానికి ప్రయత్నిస్తా’ అని ఆయన చెప్పారు.