‘నోటా’ కైనా ఓటేయండంటూ రాజమౌళి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినీ ప్రముఖులు గురువారం ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, సుధీర్‌బాబు, మాధవన్‌, ఎంఎం కీరవాణి తదితరులు ఓటు వేసిన అనంతరం దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా అందరూ వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు.

అయితే అందరికీ భిన్నంగా ఎస్ఎస్ రాజమౌళి ఎన్నికల నేపధ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా నోటా కైనా ఓటేయమన్నారు.

మా యూనిట్‌ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ స్వస్థలాలకు వెళ్లారు. మీరు కూడా ఓటు వెయ్యండి. ఒకవేళ ఏ పార్టీ, రాజకీయ నాయకుడు మీకు మంచి చేయలేరు అనిపిస్తే.. కనీసం నోటాకైనా ఓటెయ్యండి. అన్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘RRR’ సినిమా షూటింగ్ వడోదరాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం పూణేకి పయనమవనున్నారు.