ప్రకాష్ రాజ్‌పై పోలీస్ కేసు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై గురువారం బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 12న బెంగళూరులోని మహత్మ గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ‘మీడియా మరియు భావ ప్రకటన స్వేచ్ఛ’ అనే అంశంపై ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. అయితే అనుమతి లేకుండా ఈ సమావేశంలో ప్రకాశ్ రాజ్ ఓట్లు అభ్యర్థించారని.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు ప్రకాశ్‌ రాజ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ తాను రాజకీయ సమావేశంలో పాల్గొనలేదు. మీడియా మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై మాత్రమే మాట్లాడానని తెలిపారు. అంతేకాకుండా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు.

ఇక బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన.. నూతన సంవత్సర ప్రారంభంలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వేదికగా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.