గమనించండి: ‘యన్‌.టి.ఆర్‌’ఫంక్షన్ పోగ్రామ్ ఛేంజ్

ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’.ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో డిసెంబరు 16న హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకను, 21న నిమ్మకూరులో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే షెడ్యూల్ లో అనుకోని మార్పు వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌, ఆడియో వేడుకను ఒకేసారి నిర్వహించాలని టీమ్ డిసైడ్ చేసింది.

రెండు కార్యక్రమాలు డిసెంబరు 21నే జరగనున్నాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ‘యన్‌.టి.ఆర్‌.’లోని బాలకృష్ణ సరికొత్త లుక్‌ను చిత్ర యూనిట్ షేర్ చేసుకుంది. బాబి కాలర్‌ కలిగిన తెల్ల చొక్కాను ధరించిన బాలకృష్ణ కళ్లద్దాలు పెట్టుకుని, ప్రొజెక్టర్‌పై చేయి వేసిన నిలబడిన స్టిల్‌ విడుదల చేసారు.

ఇక ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్‌ బాల్యం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకూ ‘కథానాయకుడు’గా రాబోతోంది. అక్కడి నుంచి అంతిమ ఘడియల వరకూ ‘మహానాయకుడు’లో చూపించబోతున్నారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.