జయలలిత బయోపిక్కి కంగన రెడీ
ఆరుసార్లు ముఖ్యమంత్రిగా తమిళనాడును పాలించి తమిళ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు జయలలిత. పేదల బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా తంబీలచే అమ్మ అని ఆప్యాయంగా పిలుపందుకున్న గొప్ప నాయకురాలు. అగ్ర కథానాయికగానూ సౌత్ సినీపరిశ్రమను ఏలారు. జయలలిత చివరి రోజుల్లో పొలిటికల్ మెలో డ్రామా.. ఆస్పత్రి ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. అయితే అలాంటి గొప్ప నాయకురాలి బయోపిక్ ని తెరకెక్కించాలంటే ఎంతో సాహసం కావాలి. ఆ సాహసం చేస్తున్నారు తంబీలు.
అమ్మ జయలలితపై ఇప్పటికే మూడు బయోపిక్ లు ప్రారంభమైతే నిత్యామీనన్ నాయికగా `ది ఐరన్ లేడీ` సెట్స్ పై ఉంది. అలాగే కంగన టైటిల్ పాత్రలో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో మరో బయోపిక్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. హిందీలో జయ పేరుతో తెలుగు-తమిళంలో తలైవి పేరుతో ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం జయలలిత పాత్రపై క్వీన్ కంగన పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్ క్లాసులు కూడా నేర్చుకున్నారు. ఆగస్టులో తనపై లుక్ టెస్ట్ ఉండనుంది. అలాగే వర్క్ షాప్ లోనూ పాల్గొంటారని తెలుస్తోంది. అఈ చిత్రానికి రజత్ అరోరాతో కలిసి బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ చేశారు. ప్రస్తుతం కంగనతో పాటు రచయితల బృందం – నిర్మాత శైలేష్ ఆర్.సింగ్ వీళ్లంతా కలిసి మనాలిలో బయోపిక్ పై ప్రిపరేషన్స్ సాగిస్తారట. కంగనకు లుక్ టెస్ట్.. వర్క్ షాప్స్ కూడా అక్కడే చేయనున్నారు.
ఈ సినిమాలో జయలలిత పాత్ర లుక్ కోసం ప్రోస్థటిక్స్ ని ఆశ్రయించనున్నారు. 32 ఏళ్ల కంగన రకరకాల ఏజ్ లలో కనిపించాల్సి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టే మేకప్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. జయలలిత స్టెల్లా మేరీస్ (చెన్నయ్) కాలేజ్ లో చదువుకునేప్పుడే నటనపై వ్యామోహంతో కథానాయిక అయ్యారు. అటుపై సౌత్ లో అగ్రకథానాయికగా ఎదిగి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ దశలన్నిటిలోకి కంగన పరకాయం చేయాల్సి ఉంటుంది. అందుకే హాలీవుడ్ నుంచి డార్కెస్ట్ హవర్ (2017) లాంటి భారీ చిత్రానికి ప్రోస్థటిక్స్ అందించిన గ్యారీ ఓల్డ్ మన్ ని ఈ చిత్రం కోసం బరిలోకి దించుతున్నారట. ప్రస్తుతం ఆయనతో చర్చలు సాగిస్తున్నారు. ఇంకా పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. మైసూర్ లో షూటింగ్ ప్రారంభించి చెన్నయ్, ముంబై వంటి చోట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.