జాతిర‌త్నం ఫోన్ లోనే ఫినిష్ చేస్తున్నాడా?

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌`తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన న‌వీన్ పొలిశెట్టి ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సినిమాతోనే త‌న‌దైన శైలి న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందుకున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన ఆర్టిస్టుల్లో ది బెస్ట్ ఆర్టిస్ట్ అని టాలీవుడ్ పెద్ద‌లు సైతం మెచ్చారు. క‌మ‌ర్శియ‌ల్ గాను ఆ చిత్రం మంచి వసూళ్ల‌ను తెచ్చిపెట్టింది. అందుకే ఆర్టిస్ట్ గా బిజీ అయిపోతున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు. నాగ్ అశ్విన్ నిర్మాత‌గా న‌వీన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ ద‌ర్శి హీరోల‌గా జాతిర‌త్నాలు అనే సినిమా తెర‌కెక్కుతోంది. దీన్ని అనుదీప్ కే.వి అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ ముగ్గురి కాంబినేష‌న్ అన‌గానే ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ముగ్గురు మంచి క‌మెడీయ‌న్స్. స‌రిగ్గా అదే పాయింట్ ప‌ట్టుకుని ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్స్…టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల్ని క్రియేట్ చేసాయి. స్ర్కిప్ట్ పై నాగ్ అశ్విన్ కు ఉన్న క‌మాండ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌ని స్ర్కిప్ట్ జ‌డ్జిమెంట్ బాగుంటుంది. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే ఇందులో ఒక జాతిర‌త్నం మాత్రం లాక్ డౌన్ లోనూ బిజీగా గ‌డుపుతున్నాడు.

త‌న ట్యాలెంట్ ని గుర్తించిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సినిమాలు చేయ‌మ‌ని అడుగుతున్నారుట‌. కొత్త కుర్రాళ్లు చెబుతోన్న క‌థ‌ల‌ను ఫోన్ లోనే వింటున్నాడుట‌. న‌చ్చిన క‌థ‌ల‌న్నింటిని లాక్ చేస్తున్నాడుట‌. లాక్ డౌన్ అనంత‌రం ముఖా ముఖి కూర్చొని స్ర్కిప్ట్ విని  అగ్రిమెంట్ చేసుకోన‌న్నాడ‌ని స‌మాచారం. అంటే ముందుగా క‌మిట్ మెంట్ ఇవ్వ‌కుండా నేరుగా క‌లిసిన‌ త‌ర్వాత ద‌ర్శ‌కుడి సామ‌ర్ధ్యాల‌ను అంచ‌నా వేసి అప్పుడు క‌మిట్ అవుతాడ‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. మొత్తానికి లాక్ డౌన్ లోనూ ఈ జాతిర‌త్నం బిజీ అన్న మాట‌.