కరోనా అల్లాడిస్తోంది. ప్రపంచాన్ని గజగజ ఒణికిస్తోంది. అయితే ఇదే కరోనా వినోదపరిశ్రమపైనా ఉక్కుపాదం మోపింది. ఎన్నో హోప్స్ తో ఈ రంగంలో కెరీర్ ని వెతుక్కుంటూ వచ్చిన ప్రతిభావంతులకు ఇది అశనిపాతంగా మారింది. కరోనా లాక్ డౌన్ సన్నివేశం పూర్తిగా సమస్యాత్మకంగా మారింది. ఇక కరోనా భయంతో జనం ఇళ్లలోంచి బయటకు రాకపోవడంతో ఇప్పటికే చిత్రీకరణలు పూర్తయిన సినిమాలు ల్యాబులకే పరిమితమవ్వం కొందరు హీరోల్లో గుబులు రేకెత్తిస్తోంది.
అసలు తమ సినిమా రిలీజవుతుందా.. అవ్వదా? అన్న టెన్షన్ నడుమ ఓ ఇద్దరు హీరోలు చాలా బెంగ పెట్టేసుకున్నారట. అందులో ఒకరు కెరీర్ పరంగా బాగా దెబ్బ తిని కోలుకునే ప్రయత్నాల్లో ఉన్న హీరో.. ఇంకొకరు అసలు తొలి చిత్ర హీరోగా హిట్టు కొట్టి అటుపై టాలీవుడ్ లో ఓ వెలుగు వెలగాలనుకున్న యాంకర్ టర్న్ డ్ హీరో. ఈ ఇద్దరూ తాము నటించిన సినిమాలపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో హిట్టు కొట్టేస్తామన్న ధీమా అయితే ఉంది. కానీ ప్రస్తుత కరోనా కల్లోలంలో సినిమా రిలీజ్ లు సాఫీగా సాగడం లేదు. దీంతో థియేట్రికల్ రిలీజ్ చేసినా కలిసి రాదనే ఆందోళనలో ఉన్న నిర్మాతలు డిజిటల్ (ఓటీటీ) రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారట. అయితే అందుకు సదరు హీరోలు మాత్రం ససేమిరా అనేస్తుండడంతో థియేట్రికల్ రిలీజ్ లు చేస్తామని బయటికి బింకం ప్రదర్శిస్తున్నా… లోన మాత్రం వేరొకలా ఆందోళన నెలకొని ఉందిట. ఇక ఆ నలుగురు గుప్పిట్లో ఉన్న థియేటర్లకు ఎదురు డబ్బులిచ్చి ఆయా సినిమాల్ని రిలీజ్ చేసినా కానీ థియేటర్ రెంట్లు.. అయినా వస్తాయా? అన్న ఆందోళన నెలకొంది. కరోనా భయంతో జనం థియేటర్లకు రాకపోతే పబ్లిసిటీ సహా రెంట్ల రూపంలో బోలెడంత సమర్పించుకోవాల్సి ఉంటుంది. కరోనా ప్రభావం మరో రెండు మూడు నెలలు ఇలానే ఉండేట్టుంది. దీంతో ఈ సమ్మర్ లో అసలు సినిమా రిలీజవుతుందా అవ్వదా? అన్న టెన్షన్ కూడా నిలవనీయడం లేదు. ఆ ఇద్దరు హీరోల ఆశలే కాదు.. కాస్త ఇమేజ్ ఉన్న స్టార్లు సైతం ఇలాంటి డైలమాలోనే పడిపోయారు. ఇక ఓటీటీ స్టార్ గా పరిచయం అయితే పెద్ద తెర అవకాశాలు వస్తాయా రావా? అన్న టెన్షన్ సదరు యాంకర్ కం హీరోని టెన్షన్ కి గురి చేస్తోందట.