వార్త చదివి వాళ్లని కలిసి,భరోసా ఇచ్చిన లారెన్స్‌

వార్త చదివి వాళ్లని కలిసి,భరోసా ఇచ్చిన లారెన్స్‌

నటుడు లారెన్స్‌ను కలిసి వైద్య సాయం పొందడానికి చెన్నై వచ్చి గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌లో అవస్థలు పడుతున్న కుటుంబం గురించిన వార్త నిన్న మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త మొత్తానికి లారెన్స్ ని చేరుకుంది. తాను షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా వారిని పిలిపించి పలకరించి భరోసా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే….పేదలకు తనకు సాధ్యమైనంతలో సాయాజక సేవలు అందిస్తున్న లారెన్స్‌ని వెతుక్కుంటూ ఓ కుటుంబం వచ్చింది. రాజపాళయంకు చెందిన గృహలక్ష్మీ అనే ఆమె కుమారుడు గురుసూర్య విచిత్రమైన వ్యాధికి గురయ్యాడు. ఆ పిల్లాడు వైద్యం కోసం తల్లి గృహలక్ష్మీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. మరో ప్రక్క ఆమె భర్త కూడా వదిలి వెళ్లిపోయాడు. చదవండి .

దాంతో తోడబుట్టిన తమ్ముడు వెంకటేశన్‌ ని తీసుకుని కొడుకు వైద్య సాయం కోసం నటుడు లారెన్స్‌ను కలవటానికి నాలుగైదు రోజుల క్రితం చెన్నైకి వచ్చింది. అయితే వారికి నటుడు లారెన్స్‌ ఇంటి అడ్రస్‌ తెలియక పోవడంతో ఏం చేయాలో అర్దం కాన పరిస్దితుల్లో స్థానిక ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌లోనే ఉంటూ బిక్షాటన చేసుకుంటున్నారు. అక్కడకు వచ్చిన ప్రయాణికులు చేసిన దానంతో పొట్టపోసుకుంటున్నారు. ఈ విషయమై ఒక తమిళ పత్రిక వార్త ప్రచురించింది. అది మీడియాలోవైరల్ అయ్యింది. తెలుగు మీడియా సైతం దాన్ని హైలెట్ చేసింది.

మొత్తానికి అది లారెన్స్‌ దృష్టికి చేరిం ది. దీంతో వెంటనే స్పందించిన లారెన్స్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నా, మంగళవారం ఉదయాన్నే గృహలక్ష్మీని, ఆమె కొడుకు, సోదరుడిని తీసుకురమమ్మని తన అసెస్టెంట్స్ ని కారులో పంపారు. ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన వారు ఆ ముగ్గురిని కలిసి లారెన్స్‌ పంపించారని చెప్పగానే ఎంతో ఎమోషన్ కు గురయ్యారు. లారెన్స్ ఇంటికి తీసుకు వెళ్లారు. అనంతరం నటుడు లారెన్స్‌ వారిని కలిసి పరామర్శించారు.

ఆ తర్వాత లారెన్స్ మాట్లాడుతూ…. వైద్య సాయం కోసం తనును వెతుక్కుంటూ చెన్నై వచ్చారని తెలిసి చాలా బాధపడ్డానన్నారు. వీలైనంత వరకూ తన ట్రస్ట్‌ ద్వారానే ఆ పిల్లాడికి వైద్య సేవలు అందిస్తానని, తనకు సాధ్యం కాకపోతే ప్రభుత్వాన్ని సాయం కోరతానని చెప్పారు.