విలన్‌గా ఫేమస్‌ రైటర్‌ అబ్బూరి రవి!

                                                                         (ధ్యాన్)

రచయితలు ముఖానికి మేకప్‌ వేసుకోవడం కొత్తమీ కాదు. తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్‌, పరుచూరి బ్రదర్స్‌… ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద జాబితా ఉంటుంది. ఈ జాబితాలో అబ్బూరి రవి కూడా చేరుతున్నాడు. ‘బొమ్మరిల్లు’, ‘కిక్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘కేరింత’, ‘ఊపిరి’, ‘చీకటి రాజ్యం’, తాజా హిట్‌ ‘గూఢచారి’తో పాటు పలు హిట్‌ చిత్రాలకు రచయితగా అబ్బూరి వర్క్‌ చేశాడు. త్వరలో ఈయన నటుడిగా ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. అదీ ప్రతినాయకుడిగా! అంటే… విలన్‌గా! ‘కేరింత’ తర్వాత దర్శకుడు అడివి సాయికిరణ్‌ తీస్తున్న సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. ఇందులో అబ్బూరి రవి పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్ర చేస్తున్నాడు. ‘బొమ్మరిల్లు’లో పతాక సన్నివేశాలు గానీ.. ‘కిక్‌’లో వినోదం గానీ.. ‘ఊపిరి’లో భావోద్వేగాలు గానీ… సున్నితమైన సంభాషణలతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే రచయితగా అబ్బూరికి పేరు తెచ్చి పెట్టాయి. మరి, శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రలో అతను ఎలా నటిస్తారో? హాలీవుడ్‌ థ్రిల్లర్స్‌ తరహాలో అడివి సాయికిరణ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నార్ట! ‘ఎయిర్‌టెల్‌’ యాడ్స్‌తో పాపులర్‌ అయిన శషా చెట్రి ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఇంకా ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌, కృష్ణుడు, మనోజ్‌ నందం తదితరులు నటిస్తున్నారు.