సినిమా పూర్తవకుండానే సీక్వెల్..పూరి ప్లాన్ ఏంటి?

సాధారణంగా ఓ సినిమా హిట్ అయ్యాక సీక్వెల్ గురించి ఆలోచిస్తూంటారు. కానీ పూరి జగన్నాథ్ కాస్త డిఫరెంట్ సినిమా షూటింగ్ లో ఉండగానే ..సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే తాజా ప్రాజెక్ట్ కు క్రేజ్ తేవటానికే ఈ సీక్వెల్ డ్రామా అనేది కూడ సినిమా జనం అనుమానిస్తున్నారు. వార్త వివరాల్లోకి వెళితే..

రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రీసెంట్ గా సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను జరుపుకుంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే .. పూరి – చార్మీ కలిసి ‘డబుల్ ఇస్మార్ట్ ‘ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారు.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్ గా వాళ్లు ఈ సినిమా రూపొందించనున్నారు. చార్మీ నిర్మాతగా .. పూరి దర్శకుడిగా ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. అయితే రామ్ తో చేస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయితేనే దానికి సీక్వెల్ ఉంటుందనీ, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఇలా ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉంటారని అంటున్నారు.

నిజానికి ఈ కథను తన కొడుకు కోసమే పూరి తయారు చేసుకున్నాడట. అయితే స్టార్ డమ్ వున్న హీరోతో చేస్తే బాగుంటుందని సన్నిహితులు చెప్పడంతో రామ్ ను సంప్రదించాడట. మొదట ఈ ప్రాజెక్ట్ చేయడానికి రామ్ కూడా అంతగా ఆసక్తిని చూపలేదట. కానీ కథ విన్న తరువాత .. ముందుగా తాను ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టులను పక్కన పెట్టేసి ఈ సినిమా చేయడానికి రంగంలోకి దిగాడని చెబుతున్నారు.

ఈ చిత్రం కోసం రామ్‌ మరింత ఫిట్‌గా తయారయ్యారు. ఇందులో ఆయన విభిన్నమైన మాస్‌ పాత్రలో కనిపించనున్నారట. ఈ ఏడాది కుదిరిన క్రేజీ కాంబినేషన్‌ ఇది. ఎనర్జిటిక్‌ స్టార్‌, డ్యాషింగ్‌ డైరెక్టర్‌ కలిసి ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతున్నారో చూడాలి. డిజాస్టర్ చిత్రం ‘మెహబూబా’ తర్వాత పూరీ తీస్తున్న చిత్రమిది. రామ్‌ గత ఏడాది ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాతో ఫ్లాప్ ఇచ్చారు.