హీరోయిన్ ఐశ్వ‌ర్య అర్జున్ కు క‌రోనా పాజిటివ్!

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ సెల‌బ్రిటిల్నీ చుట్టేస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ స‌హా టాలీవుడ్, కోలీవుడ్ భాష‌ల‌లో ప‌లువురు న‌టీన‌టులు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె, హీరోయిన్ ఐశ్వ‌ర్య కూడా క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఐశ్వ‌ర్య అధికారికంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. ప్ర‌స్తుతం ఐసోలేష‌న్ లో ఉండి చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. చికిత్స లో బాగంగా వైర‌స్ కు అందుబాటులో ఉన్న మందులు డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం ఆరోగ్యం బాగానే ఉంద‌ని…వీలైనంత‌ త్వ‌ర‌గానే కోలుకుంటాన‌ని ధీమా వ్య‌క్తం చేసింది.

అలాగే త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారు, ఇటీవలి కాలంలో త‌న‌ని క‌లిసిన వారు క‌చ్చితంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించింది. ఎట్టి ప‌రిస్థితుల్లో అశ్ర‌ద్ద వ‌హించొద్ద‌ని హెచ్చ‌రించింది. ఇక ఐశ్వ‌ర్య 2013లో న‌టిగా ఎంట్రీ ఇచ్చింది. కానీ హీరుయిన్ రేసులో ఇప్ప‌టికీ వెనుక‌బ‌డే ఉంది. ఏడెళ్ల కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ మూడు సినిమాల్లోనే న‌టించింది. అదీ త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లో క‌లిపి చేసిన సినిమాలివి. ఇంట్లో పెద్ద స్టార్ ఉన్నా ఐశ్వ‌ర్య అవ‌కాశాలు అందుకోవ‌డంలో తొలి నుంచి విఫ‌ల‌మ‌వుతూనే ఉంది.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కూడా క‌రోనా పాజిటివ్ కేసులు భారీగానే న‌మోదవుతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో ఆ మ‌ధ్య లాక్ డౌన్ మిన‌హాయింపులు ఇచ్చిన‌ప్ప‌టికీ బెంగుళూరు సిటీ మాత్రం లాక్ లోనే ఉంది. మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఎక్కువ‌గా ఉండ‌టంతోనే అక్క‌డ ప్ర‌భుత్వం బెంగుళూరు సిటీకి లాక్ వేసింది. ఐటీ కార్యాల‌యాలు, కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉండ‌టంతో క‌రోనా ముందుగా అక్క‌డ నుంచి సిటీలోకి ఎంట‌రైంది. అటుపై జ‌నాల్లో స్వైర విహారంగా మారింది.