కావాలనే వైవీఎస్‌ చౌదరి చేశారు, మండిపడ్డ మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు, వైకాపా నేత మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించారంటూ వార్తలు వస్చిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై మోహ‌న్‌బాబు స్పందించారు.ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేసారు.

ఈ విషయంపై మోహన్ బాబు ఏమంటారంటే….2009లో `స‌లీమ్` సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశాం. మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి వైవిఎస్ చౌదరికి రూ.40ల‌క్ష‌ల చెక్ ఇచ్చాం.

అయితే సలీమ్ చిత్రం అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో..వైవిఎస్ చౌద‌రితో చేయాల్సిన తర్వాతి సినిమాను వ‌ద్ద‌నుకున్నామన్నారు. సినిమా చేయ‌డం లేద‌ని వైవిఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని కూడా ఆయనకు చెప్పామన్నారు.

చెక్ ను బ్యాంక్ లో వేయొద్దని చెప్పినా కూడా కావాల‌నే వైవిఎస్ చౌదరి చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ బౌన్స్ చేశారని మోహన్ బాబు ఆరోపించారు. నాపై చెక్ బౌన్స్‌ కేసు వేసి కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. దీంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని మేము సెష‌న్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నామని, కొన్ని చానెల్స్‌లో తనపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దని మోహన్ బాబు కోరారు.