ప్రభాస్ పై బాలీవుడ్ భారీ బెట్టింగ్..ఇదిగో ఎవిడెన్స్

అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బాలీవుడ్ ని తన కలెక్షన్స్ తో కంగారు పెడుతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ భారత్ చిత్రానికి పోటీ అన్నట్లు ఈ కలెక్షన్స్ దుమ్ము రేపాయి. దాంతో బాహుబలితో సౌత్ పై దృష్టి పెట్టిన అక్కడ నిర్మాతలు మరోసారి ఎలర్ట్ అయ్యారు. ఇప్పుడు సాహో చిత్రం రైట్స్ ని సొంతం చేసుకుని సొమ్ము చేసుకుందామనుకుంటున్నారు. ఇప్పటికే టీ సీరిస్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరుగా జాయిన్ అయ్యింది. దాంతో బాలీవుడ్ నుంచి మేజర్ కాస్టింగ్ ని తీసుకొచ్చి నింపింది. అలాగే నార్త్ లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయటానికి పెద్దవాళ్లే పోటీ పడుతున్నారు.

ఈ సినిమా ఓవర్ సీస్ థియేట్రికల్‌ పంపిణీ హక్కుల్ని అంతర్జాతీయంగా పేరుగాంచిన ఫార్స్‌ ఫిలిమ్స్‌ దక్కించుకుంది. ఇప్పుడు యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ భాగస్వామ్యంతో ఓవర్ సీస్ ముందుకు తీసుకురానుంది ఫార్స్‌ ఫిలిమ్స్‌. మధ్య ప్రాచ్యదేశాల్లో హాలీవుడ్‌, బాలీవుడ్‌, అరబిక్‌, దక్షిణాది చిత్రాల పంపిణీలో ఈ సంస్థకు మంచి పేరుంది.

ఫార్స్‌ ఫిలిమ్స్‌ సీఈవో అహ్మద్‌ గొల్చీన్‌ మాట్లాడుతూ..‘‘ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’. ట్రైలర్‌ విడుదలయ్యాక సినిమాకు మరింత క్రేజ్‌ పెరిగింది. ఈ ఏడాదిలో అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన చిత్రమిది. అంతర్జాతీయ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ రూపొందించిన పోరాట ఘట్టాలను వీక్షించడానికి ప్రభాస్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు’’అన్నారు.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తోన్న ‘సాహో’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్‌ స్టార్ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. సుజీత్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది.
ఆగస్టు 15న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ‘సాహో’ విడుదలకానుంది.