భార‌తీయుడు 2 ..ఈసారి పోటు బ‌లంగా పొడ‌వాలి

సేనాప‌తి ఈజ్ బ్యాక్ .. బొడ్లో క‌త్తి దోపాడు!

అవినీతిపై ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌ల‌పెట్టిన యుద్ధం `భార‌తీయుడు`. రెండు ద‌శాబ్ధాల‌ క్రితం రిలీజైన ఈ సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. అవినీతి అధికారులు, రాజ‌కీయ నాయకుల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించింది. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అస‌మాన న‌ట ప్ర‌తిభ‌తో అద్భుత‌మే చేశారు. తండ్రి కొడుకులుగా క‌మ‌ల్ ద్విపాత్రాభిన‌యం మ‌హ‌దాద్భుతం.

మ‌రోసారి అదే క‌ల‌యిక‌లో భార‌తీయుడు 2 తెర‌కెక్కుతోంది. క‌మ‌ల్ హాస‌న్- శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న ఈ సినిమాని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. 2.0 త‌ర్వాత అదే సంస్థ నుంచి వ‌స్తున్న సినిమాగా అత్యంత క్రేజును సంత‌రించుకుంది. అయితే కొన్ని ఆర్థిక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని శంక‌ర్ ఎంతో పంతంతో పూర్తి చేయాల‌ని సంక‌ల్పించారు.దాదాపు ఆగిపోయిన చిత్రాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాయ‌ల‌సీమ‌.. రాజ‌మండ్రి జైల్లో కొత్త షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. నేడు స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ఒక కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేశాడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ ఇండియ‌న్ 2 పోస్ట‌ర్ ని రివీల్ చేయ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అభిన‌వ భార‌తీయుడిగా క‌మ‌ల్ లుక్ ఎలా ఉండ‌బోతోంది? అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. క‌మ‌ల్ లుక్ ఆక‌ట్టుకుంది. సేనాప‌తి ఈజ్ బ్యాక్ ఎగైన్. ఆధునిక స‌మాజంలో వింత‌పోక‌డ‌లు అవినీతి మునుప‌టితో పోలిస్తే ఎన్నో రెట్టు పెరిగింది. అందుకే ఇప్పుడు సేనాప‌తి క‌త్తి పోటు ఎలా ఉండ‌బోతోంది? అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఉంది. ఈసారి పోటు మ‌రింత బ‌లంగా పొడ‌వాలి. మామూలుగా పొడిస్తే చ‌చ్చే చేప‌లు కావు ఇవి. అవినీతి జ‌ల‌గ‌లు. అందుకు త‌గ్గ‌ట్టే బ‌ల‌మైన క‌థాంశాన్ని రెడీ చేయ‌కుండా శంక‌ర్ ముందుకు వెళ్ల‌డు. అయితే అప్ప‌ట్లో సుజాత రంగ‌రాజ‌న్ అనే గొప్ప సైంటిస్ట్ కం రైట‌ర్ శంక‌ర్ వెంట ఉండేవారు. కానీ ఆయ‌న చ‌నిపోయి చాలాకాల‌మే అయ్యింది. ఇప్పుడు జేయ‌మోహ‌న్ అనే జ‌ర్న‌లిస్ట్ కం రైట‌ర్ అండ‌దండ‌ల‌తో శంక‌ర్ క‌థ‌ల్ని వండిస్తున్నారు. ఈ కాంబో 2.0 క‌థ‌ని అద్భుతంగా ఆవిష్క‌రించారు. ఇప్పుడు అంత‌కుమించి భార‌తీయుడు 2 క‌థ‌ని తెర‌పై ఆవిష్క‌రిస్తారనే భావిద్దాం.