‘ప్లాన్ బి’ కు షిప్ట్ అయిన బన్ని,త్రివిక్రమ్

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ గత కొద్ది రోజులుగా డైలమోలో ఉన్నారు. వీరిద్దిరి కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. హిందీ చిత్రం సోను కె టిటు కి స్వీటీ ఆధారంగా ఈ సినిమా వుంటుందని, డిసెంబర్ 11న ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్ లేదా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం వుందని ప్రచారం జరిగింది. అందులో నిజం లేకపోలేదు.

అయితే ఈ రీమేక్ విషయమై ఇద్దరూ ఒక కంక్లూజన్ కు రాలేకపోయారని వినికిడి. మరో హీరోకు అవకాసం ఉన్న స్క్రిప్టు కావటం…ఆ సినిమాని అల్లు అర్జున్ కు తగినట్లు మార్చటం మీద డిస్కషన్స్ జరిగాయి. కానీ ఆ రీమేక్ తమకు వర్కవుట్ కాదని ఇద్దరూ డిసైడ్ అయ్యారు.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ ఓ స్టోరీ లైన్ బన్నికి చెప్పటం జరిగింది. వెంటనే ఎక్సైట్ అయ్యిన అల్లు అర్జున్ పూర్తి స్క్రిప్టు రెడీ చేయమన్నారట. దాంతో త్రివిక్రమ్ ..రీమేక్ ని మధ్యలోనే ఆపేసి..తను చెప్పిన పాయింట్ మీద వర్కవుట్ చేయటం మొదలెట్టారట. డిసెంబర్ నెలాఖరకు త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్టు నేరేట్ చేస్తారు. ఏమన్నా మార్పులు ఉంటే సరిచేసుకుని జనవరి నుంచి షూట్ కు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ..భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బాలీవుడ్ సోయగం కైరా అద్వానీ ని ఫైనల్ చేసారట. తొలి సినిమాతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కైరా ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే ఆమె ఈ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది.