త్రివిక్రమ్ లేకుండానా..కష్టమేమో ఆలోచించు నాగ్

మామూలు కుటుంబాల్లో పిల్లలకు ఆస్దులు, పేరు ప్రతిష్టలు ఇస్తూంటారు తల్లి తండ్రులు. కానీ సినిమావారు మాత్రం తమ పిల్లలు రీమేక్ చేసుకోవటానికి తమ హిట్ సినిమాలు, సీక్వెల్స్ చేసుకోవటానికి కొన్ని సినిమాలు, తమ హిట్ పాటలు, తమ ఇమేజ్ ని వారసత్వంగా ఇస్తూంటారు. ఇప్పుడు నాగార్జున సైతం అదే పని చెయ్యబోతున్నారు.

అక్కినేని నాగార్జున తన  హిట్ సినిమాల్లో ఒకటైన ‘మన్మధుడు’ సినిమా సీక్వెల్ చేసుకోమని తమ పెద్ద కుమారుడు నాగచైతన్యకు ఇస్తున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా మన్మధుడు 2 అనే టైటిల్ ని సైతం రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ రచనలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మన్మధుడు  సినిమా దాదాపు దశాబ్దంన్నర కిందట వచ్చింది. సరదా ఫన్నీగా సాగిపోయే ఈ సినిమా ఇప్పటికీ అప్పుడప్పుడూ టీవీ ఛానెల్స్ లో ప్రసారం అవుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

దాంతో ఈ సినిమా సీక్వెల్ అంటే ఖచ్చితంగా ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుంది. అందులో నాగార్జున సైతం ఓ గెస్ట్ రోల్ చెయ్యచ్చు. అలాగే తన కుమారుడుకు ఓ హిట్ సినిమా ఇచ్చినట్లు ఉంటుంది అని నాగ్ ఆలోచిస్తున్నారుట. అయితే ఈ సినిమాకు అప్పట్లో త్రివిక్రమ్ రచన చేయటం కలిసి వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో త్రివిక్రమ్ వచ్చి నాగచైతన్యకు స్క్రిప్టు వర్క్ చేస్తారా..దానికి తోడు త్రివిక్రమ్ సినిమాలు భాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి కూడా. మరి నాగ్ ఏమి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడో చూడాలి.