విజయ్ కాంత్ కు ఎంత దుస్దితి,ఫ్యాన్స్ బాధ

ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ కు తమిళనాట మంచి క్రేజ్. తెలుగులోనూ ఆయన డబ్బింగ్ సినిమాలు బాగా ఆడేవి. అయితే ఆయన పెద్ద వాడు అవటం, తాగుడు, రాజకీయాలు ఆయన్ని సినిమాలనుంచి దూరం పెట్టాయి. దానికి తోడు ఆ మధ్యన విజయ్ కాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. విజయ్ కాంత్ విదేశాల్లో చికిత్స చేయించుకుని వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారు. అయితే ఆయన మరో సమస్య వచ్చి పడింది. తాజాగా విజయ్‌కాంత్ ఆస్తులను ఓ జాతీయ బ్యాంక్ వేలం వేస్తోంది.

ఈ వేలం వార్త తమిళ న్యూస్ పేపర్లలో ప్రకటనలు దర్శనం ఇవ్వడంతో అభిమానులు షాకయ్యారు. రూ. 5 కోట్ల అప్పు కట్టక పోవడంతో ఆయన ఆస్తులు వేలం వేస్తున్నట్లు అందులో ఉంది. చాలా కాలంగా విజయ్ కాంత్ ‘ఆండాల్ అళగర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ పేరుతో ఓ సంస్థను రన్ చేస్తున్నారు. దీని పేరు మీద రూ. 5 కోట్ల అప్పు తీసుకున్నారు. అయితే ఈ డబ్బు సకాలంలో తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఆయనకు చెందిన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించారు.

విజయ్‌కాంత్, ఆయన భార్య ప్రేమలత సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం ప్రకటన చూసిన అభిమానులు కొందరు వాటిని దక్కించుకోవడానికి వేలంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. సదరు పత్రిక ప్రకటనలో ఆస్తులకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి.