‘రంగస్థలం’ హిట్‌కి కారణం ఆది అంటున్నాడేంటి సుకుమార్?

ఆది పినిశెట్టి, తాప్సి జంటగా వస్తున్న ‘నీవెవరో’ సినిమా టీజర్ ఇటీవలే విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆది గురించి, ఆ మూవీ గురించి స్పందించారు డైరెక్టర్ సుకుమార్. అది గురించి చెప్పాలంటే ముందు అతని తండ్రి రవిరాజా పినిశెట్టి గారి గురించి చెప్పాలి. రచయితగా ఉన్నప్పుడు ఆయన విలువ నాకు తెలియలేదు. దర్శకుడిగా మారుతున్నప్పుడే తెలిసింది. ఆయన చేసే సినిమాలు చూస్తున్నప్పుడు ఆయన మీద విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. అతని కుమారుడిగా ఆది అంటే కూడా నాకు ఇష్టమే.

ఆది సినిమాలు చూశాను. హీరోగానే కాదు విల్లన్ పాత్రల్లో కూడా అతని నటన చూసి ‘రంగస్థలం’ మూవీలో తీసుకున్నాను. ఆది పాత్ర షూటింగ్ మొదలయ్యాక మొదటి వారంలో ఆదితో సరిగా కలవలేకపోయాను నేను. సీన్లో ఎలా చేయాలో సలహాలు ఇచ్చేవాడిని కాదు. దీంతో తన పెర్ఫార్మన్స్ నాకు నచ్చట్లేదేమో అని డౌట్ వచ్చింది ఆదికి. అసిస్టెంట్ డైరెక్టర్ల వద్దకు వెళ్లి నా పెర్ఫార్మన్స్ సుకుమార్ కి నచ్చట్లేదా నాతో సరిగా మాట్లాడట్లేదు అని అడిగాడట. ఏమీ చెప్పకుండానే పర్ఫెక్ట్ గా చేస్తున్నప్పుడు ఇక మాటలెందుకు అనిపించింది నాకు. అంతే తప్ప కావాలని చేసింది కాదు.

ఆది తన పాత్రలో ఎంతలా ఒదిగిపోయాడంటే సినిమా మొత్తాన్ని తనే నడిపించాడు. చరణ్ ఫీల్ అవుతాడేమో అని భయపడ్డాను. ఇదే విషయం రాంచరణ్ తో చెబితే ఆది పాత్ర అలాంటిది, నువ్వు అలంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పాడు. ‘రంగస్థలం’ హిట్ అవటానికి ప్రధాన కారణం ఆది. ఇదంతా ఇంతగా ఎందుకు చెబుతున్నా అంటే ‘నీవెవరో’ సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నాడు. ముందు కూడా హీరోగా చాల సినిమాలు చేశాడు కానీ ఇది ప్రత్యేకమైన కథ. కోన వెంకట్ లాంటి గొప్ప రచయిత నుండి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఆది పెద్ద హీరో అవ్వాలని అవ్వాలని ఆశిస్తున్నా అన్నారు.