‘సైరా’ ప్రచార కార్యక్రమాల్లో నయనతార ఇందుకే రాలేదు

లేడీ సూపర్ స్టార్ నయనతారది భిన్నమైన స్టైల్! తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమెకు ఓ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది. తొలుత మళయాళ సినిమాలో నటించి సినిమా రంగంలోకి ప్రవేశించిన నయనతార ఆ తరువాత తెలుగు, తమిళంలో అగ్రహీరోలందరి సరసన నటించారు. ఆమె మొదటి నుంచి ఏ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనదు. ఆ విషయం సినిమా ప్రారంభానికి ముందే ఆమె చెబుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎంతటి టాప్ హీరో సినిమా అయినా సరే ఆమె తొలి నుంచి అదే పద్దతిని అనుసరిస్తోంది.

ఈ విషయమై గతంలో పలుమార్లు చర్చ, రచ్చ కూడా జరిగాయి. అయినా ఆమె అవేమీ
పట్టించుకోలేదు. తనకు నచ్చిన విధంగా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ముంబైలో సైరా టీజర్‌ విడుదల అయింది. ఈ కార్యక్రమంలో బిగ్ బి అమితాబచ్చన్, నయనతార మినహా మిగిలిన నటీనటులందరూ పాల్గొన్నారు. ‘సైరా’ ప్రచార కార్యక్రమాల్లో నయనతార కనిపించకపోవడం పెద్ద టాక్ అయింది.

బిగ్ బి ఆరోగ్యరీత్యా ఈ వేడుకకు రాలేకపోయారు. నయనతార తన పద్దతి ప్రకారమే ఈ టీజర్ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరుకాలేదు. అయితే ఆమె కావాలనే దీనికి రాలేదని మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆమె వైఖరి తెలిసీ మళ్ళీ పదే పదే అదే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. పైగా అసలు సంగతేంటంటే ఆ సమయంలో నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ చిత్ర షూటింగ్‌లో ఉంది. అప్పుడు ఆ చిత్రం షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. అది మరొక కారణం. ఆమె తొలి నుంచి ఎన్నో ఏళ్లుగా ఆదే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ రోజు కొత్తేమీ కాదని మీడియా అర్ధం చేసుకుంటే మంచిది.